తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం దేవాలయ నిధుల వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ (HR&CE) శాఖ పరిధిలోని దేవాలయ నిధులతో చేపట్టాలని ప్రతిపాదించిన రూ.245.85 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులకు ఇచ్చిన పరిపాలన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రాజెక్టుల్లో రూ.115 కోట్లతో 29 కళ్యాణ మండపాలు, రూ.130 కోట్లతో 17 కమర్షియల్ సముదాయాల నిర్మాణాలు ఉన్నాయి. న్యాయపరమైన వివాదాలు, దేవాలయాలపై పెరుగుతున్న ఆర్థిక భారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
దేవాలయాల ఆదాయాన్ని వాణిజ్య అవసరాల కంటే ఆలయ అభివృద్ధి, భక్తుల సంక్షేమం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు వినియోగించాలనే లక్ష్యంతో ఈ చర్య చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే గతంలో డీఎంకే ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను భక్తులకు తక్కువ ఖర్చుతో వివాహ వేదికలు అందించడం, దేవాలయ ఆదాయాన్ని పెంచడం కోసం రూపొందించినట్లు పేర్కొంది. దీంతో విజయ్ సర్కార్ నిర్ణయంపై డీఎంకే తీవ్ర విమర్శలు చేస్తూ, బీజేపీ ఒత్తిళ్లకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. మరోవైపు దేవాలయ నిధులు ఆలయాల అభివృద్ధికే ఖర్చు కావాలనే అభిప్రాయంతో భక్తులు, హిందూ సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నాయి.







