పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ప్రీ-రిలీజ్ వేడుక (Pre-Release Event) వివాదంలో చిక్కుకుంది. పరిమితికి మించి జన సమీకరణ చేసి, సినిమా క్రేజ్ కోసం ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్ ఇబ్బందులకు (Traffic Issues) కారణమయ్యారనే ఆరోపణలతో ఈవెంట్ ఆర్గనైజర్పై (Event Organizer) జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మార్చి 15 (ఆదివారం) సాయంత్రం యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు పోలీసులు కేవలం 1,500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే, అభిమానులను భారీ సంఖ్యలో జనసమీకరణ చేసి తరలించడంతో గ్రౌండ్ వద్ద సుమారు 5,000 మందికి పైగా గుమిగూడారు.
అనుమతికి మించి భారీ స్థాయిలో జనం రావడంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి యూసుఫ్గూడ వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నీ గంటల తరబడి స్తంభించిపోయాయి. సినిమా క్రేజ్ కోసం ఉద్దేశపూర్వకంగానే జన సమీకరణ చేపట్టారనే ఆరోపణలున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా, శాంతిభద్రతల పరంగా కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు.
నిర్వాహకులు పోలీసు నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీ ఎత్తున జనాలను తరలించడం, వారిని నియంత్రించడంలో విఫలం కావడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. వయోలెన్స్ సెక్షన్ 188 (ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన) ప్రకారం ఈవెంట్ ఆర్గనైజర్పై జూబ్లీహిల్స్ పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేసు టాలీవుడ్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. భారీ చిత్రాల వేడుకల సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








