టీటీడీ బోర్డు సభ్యుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో సందీప్ గంజాయి సేవిస్తున్నట్లుగా కనిపిస్తుండటంతో నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. వైరల్ వీడియోలో సందీప్ మెడలో ధరించిన లాకెట్ కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసులో టీటీడీ బోర్డు మెంబర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్ అరెస్ట్ అయ్యాడు. నిర్లక్ష్య డ్రైవింగ్తో ఓ వ్యక్తి ప్రాణం తీసిన కేసులో నిందితుడిగా ఉన్న సందీప్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వీడియోలో టీటీడీ బోర్డు మెంబర్ కుమారుడు గంజాయి సేవిస్తూ కనిపించడం, అంతేకాకుండా అతడు శిలువ (క్రాస్) సింబల్ లాకెట్ ధరించడం కూడా సంచలనంగా మారింది.
ఈ వీడియో ఆధారంగా కొందరు నెటిజన్లు టీటీడీ బోర్డు సభ్యుడి కుమారుడి వ్యవహారంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆనంద్ సాయికి టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించిన సనాతని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల రాయదుర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి సందీప్పై ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి సేవిస్తున్న వీడియో బయటపడడంతో ప్రమాద సమయంలో సందీప్ డ్రగ్స్ సేవించి ఉన్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు డ్రగ్ టెస్ట్ నిర్వహిస్తే ఆ సమయంలో అతడి శరీరంలో మత్తు పదార్థాల ఆనవాళ్లు ఉన్నాయా లేదా అనే విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.







