తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి సత్యప్రసాద్ ప్రకటించారు. తొక్కిసలాట ఘటనపై విచారణ జరుగుతుందని, ప్రమాదానికి గల కారణం సమన్వయ లోపమా లేక ఏ ఇతర కారణమో తెలుస్తుందని చెప్పారు.
యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ : హోంమంత్రి అనిత
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత విచారం వ్యక్తం చేశారు. ఇదొక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కాగా, ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని చెప్పారు. బాధ్యులు ఏ స్థాయి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తప్పు డీఎస్పీ, డ్రైవర్దే..
తొక్కిసలాట ప్రమాదంపై సీఎం చంద్రబాబుకు జిల్లా కలెక్టర్ నివేదిక అందించారు. డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారు అని ఆ నివేదికలో తేల్చారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదని, ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారని, అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు.








