దేశమంతా 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ.. తిరుపతిలో తీవ్ర ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అధికారిక వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.
తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో రాష్ట్ర 80వ స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంసలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన రక్తపోటు (Blood Pressure) పడిపోయింది. మాట్లాడుతుండగానే ఆయన కళ్లుతిరిగి అకస్మాత్తుగా స్టేజీపైనే పక్కకు వాలిపోయారు.
మంత్రి ఒక్కసారిగా కిందకు వాలిపోవడాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయన కిందపడిపోకుండా పట్టుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
వెంటనే అక్కడే ఉన్న వైద్యులు, మంత్రిని పరీక్షించి ప్రాథమిక చికిత్స అందించారు. బీపీ డౌన్ కావడంతోనే ఈ ఘటన జరిగిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మంత్రి ఆనం మళ్లీ వేడుకల్లో పాల్గొనగా, ఆయన ప్రసంగాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కొనసాగించారు. ఈ ఘటనతో వేడుకల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.








