తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో మరో కీలక డిజిటల్ అడుగు వేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు పాఠశాల విద్యాశాఖ సేవలను మరింత సులభంగా అందించేందుకు వాట్సాప్ ఆధారిత సేవలను ప్రారంభించింది. ఈ సేవల ద్వారా విద్యార్థులు తమ ప్రోగ్రెస్ రిపోర్టులు, హాల్ టికెట్లు, మార్కుల మెమోలు, పరీక్షల ఫలితాలను నేరుగా మొబైల్లోనే పొందే అవకాశం కల్పించింది. అలాగే పాత ఎస్ఎస్సీ మెమోలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు మెమో సవరణల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కొత్త విధానం వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గి, విద్యార్థులకు సేవలు మరింత వేగంగా అందనున్నాయి.
ఈ వాట్సాప్ ప్లాట్ఫారమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా లబ్ధి పొందనున్నారు. త్వరలో విద్యార్థుల హాజరు, స్కాలర్షిప్ వివరాలు, యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాల పంపిణీ సమాచారం, మధ్యాహ్న భోజన పథకం అప్డేట్లు వంటి సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలంగాణ రాష్ట్ర పక్షి ‘పాలపిట్ట’ను డిజిటల్ మస్కట్గా పరిచయం చేస్తూ విద్యార్థులకు ఆసక్తికరంగా సమాచారం చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం తెలంగాణ డిజిటల్ గవర్నెన్స్కు మరో మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది.








