తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు క్రమంగా తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారీ ఊరట లభించనుంది.
మరోవైపు మరఠ్వాడా ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం, తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతున్న వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే రానున్న నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉండటంతో వాతావరణం మరింత చల్లబడనుంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.








