10 మంది పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దక్కింది. తెలంగాణలో (Telangana) 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును (Party Defection Case) సుప్రీంకోర్టు (Supreme Court) డిస్పోజ్ చేసింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇటీవల స్పీకర్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించామని స్పీకర్ (Speaker) తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు.
స్పీకర్ తీర్పు వచ్చినందున కేసును అత్యున్నత న్యాయస్థానం ముగించింది. రేపటిలోగా తీర్పు కాపీలు, 5 రోజుల్లో ఇతర డాక్యూమెంట్లను పిటీషనర్లకు పంపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు జస్టిస్ సంజయ్ కరోల్ (Justice Sanjay Karol) , జస్టిస్ అగస్టీన్ జార్జి (Justice Augustine George Masih) ధర్మాసనం విచారణ జరిపింది. ఇదిలా ఉండగా.. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad Kumar) నిన్న (బుధవారం) కీలక తీర్పు వెల్లడించారు.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. అనంతరం, ఇద్దరిపై వేసిన రెండు పిటిషన్లకు డిస్మిస్ చేశారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంతటితో స్పీకర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు తెరపడింది. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గురువారం వరకు ఫిరాయింపు కేసులో ఏదో ఒకటి తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో నేడు స్పీకర్ బుధవారం తుది తీర్పును వెల్లడించారు.








