సాయిపల్లవి (Sai Pallavi) తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేకమైన క్రేజ్ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యువతలో ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసామాన్యం. స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) వంటి వ్యక్తి ఆమెను ‘లేడీ పవర్ స్టార్’ (Lady Power Star)గా కితాబు ఇవ్వడం ఆమె స్టార్డమ్ను తెలియజేస్తుంది. తెలుగులో ఆమె చివరిసారిగా అక్కినేని నాగ చైతన్య ( Akkineni Naga Chaitanya)హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’ (Thandhal) చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత తెలుగులో ఆమె కొత్త ప్రాజెక్ట్లను ప్రకటించలేదు.
ప్రస్తుతం సాయిపల్లవి భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్గా భావిస్తున్న ‘రామాయణం’ (Ramayanam) చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ (Nitesh Tiwari) రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఆమె సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ దేవోల్ వంటి భారీ తారాగణం ఉంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ రూ.4 వేల కోట్ల బడ్జెట్ చిత్రం, మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయి, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.








