అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా రాజకీయ విద్వేషాలు మరోసారి భగ్గుమన్నాయి. స్థల వివాదంలో చోటుచేసుకున్న ఘర్షణ కాస్తా వైసీపీ నేతపై హత్యాయత్నం వరకు దారితీసింది. మంత్రి అనుచరులు కొందరు వ్యక్తులు వైసీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పి.దశరథరామిరెడ్డిపై వేటకొడవళ్లు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.
రాయచోటిలోని ఒక ఖరీదైన స్థలానికి సంబంధించి గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ స్థలంపై ప్రస్తుతం హైకోర్టు స్టే కూడా ఉంది. అయితే, ఈ వివాదంలో సెటిల్మెంట్ చేస్తామంటూ రంగంలోకి దిగిన అధికార పార్టీకి చెందిన మంత్రి రాంప్రసాద్రెడ్డి అనుచరులు కొందరు వ్యక్తులు, శనివారం రాత్రి నుంచే ఆ స్థలంలో తిష్టవేసి హంగామా సృష్టించినట్లు తెలుస్తోంది.
ఆదివారం ఉదయం వైసీపీ నేత దశరథరామిరెడ్డి అక్కడికి చేరుకోగా, ఒక్కసారిగా మంత్రి అనుచరులు ఆయనపై దాడికి తెగబడ్డారు. దశరథరామిరెడ్డితో పాటు ఆయన అనుచరులను వేటకొడవళ్లతో వెంబడించి మరీ దాడి చేశారు. ఈ క్రమంలో దశరథరామిరెడ్డికి చెందిన కళ్యాణ మండపంలోని అద్దాలను, వాహనాన్ని దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు.
ఈ దాడిలో దశరథరామిరెడ్డికి శరీరంలోని పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడివున్న ఆయనను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని సమాచారం.








