తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టయిన రోజును టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగిస్తూ గుర్తుచేసుకుంది. చంద్రబాబు 53 రోజుల పాటు జైలులో ఉన్న సమయంలో 53 కొవ్వొత్తులు వెలిగించి టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదే క్రమంలో మంత్రి నారా లోకేష్ భార్య, సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి కూడా 53 కొవ్వొత్తులు వెలిగించి ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ పోస్టుపై సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో స్పందించారు.
‘‘దొరసాని నారా బ్రహ్మణి గారు..’’
నారా బ్రహ్మణిని ఉద్దేశిస్తూ తన కౌంటర్ను ‘‘దొరసాని శ్రీమతి నారా బ్రహ్మణి గారు..’’ అంటూ ప్రారంభించిన నాగేశ్వరరావు.. ఆమె పోస్టులో వ్యంగ్యం, హాస్యం సమపాళ్లలో కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘మీరు తెలుగు చదవగలరో లేదో తెలియదు గానీ, మీరు మీ ట్విట్టర్ పోస్ట్ ద్వారా వ్యంగ్యాన్ని, హాస్యాన్ని సమపాళ్లలో బ్రహ్మాండంగా పండించారు. అదెలా అంటారా?’’ అంటూ.. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం, ఎన్టీఆర్తో ఆయనకు ఉన్న రాజకీయ సంబంధం, తెలంగాణ అంశంపై టీడీపీ వైఖరిని ప్రస్తావిస్తూ మూడు అంశాలను తన కౌంటర్లో పేర్కొన్నారు.
‘‘దేశంలోనే అత్యంత సంపన్న సీఎం.. తెలుగు జాతికి అపఖ్యాతి’’
1970వ దశకంలో అతి తక్కు భూమితో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. అనతికాలంలోనే దేశంలోనే అత్యంత రిచెస్ట్ సీఎంగా ఎలా ఎదిగారని నారా బ్రహ్మణిని రిటైర్డ్ ఐపీఎస్ ప్రశ్నించారు. ‘‘రెండో లేదా ఇరవై రెండో ఎకరాలతో 1970వ దశకంలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, నేడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ‘తెలుగు జాతికి’ అప‘ఖ్యాతి’ తీసుకొచ్చిన నిస్వార్థ అవినీతి పరుడు మీ మామగారు అగౌరవ నారా చంద్రబాబు నాయుడు’’ అంటూ సెటైర్లు పేల్చారు.
ప్రతిష్టాత్మక ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం రూ.931 కోట్ల ఆస్తులతో దేశంలోనే రిచెస్ట్ సీఎంలలో చంద్రబాబు రెండో స్థానం ఉండడం గమనార్హం.
ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారని ఆరోపణ
టీడీపీ వ్యవస్థాపకుడు, నారా బ్రహ్మణి తాత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విషయాన్ని నాగేశ్వరరావు ప్రస్తావించారు. ‘‘తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అహర్నిశలు కృషి చేసిన మీ తాతగారు, చిరస్మరణీయులైన నందమూరి తారక రామారావుని ‘నిస్వార్థ’ వెన్నుపోటు పొడిచి ‘తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చిన’ తెలుగు ద్రోహి, ఆయన అకాల మరణానికి కారకుడైన నయవంచకుడు మీ మామ అగౌరవ నారా చంద్రబాబు’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
2008లో రాష్ట్ర విభజనకు అంగీకరించారని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి లాక్కోవడమే కాకుండా, తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టేందుకు చంద్రబాబు లేఖ రాశారని గుర్తుచేశారు. ‘‘తెలుగు జాతి ఐక్యతను, ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీని మీ తాతగారి నుంచి గుంజుకోవడమే కాకుండా, 2008లో తెలుగు ప్రజలను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడానికి లిఖితపూర్వకంగా అంగీకరించి, తెలుగు జాతికి తీరని ద్రోహం చేసిన ‘ఘనుడు’ మీ మామగారు అగౌరవ నారా చంద్రబాబు గారు’’ అంటూ నాగేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు.
చివరగా నారా బ్రహ్మణి చేసిన పోస్టును ఉద్దేశిస్తూ.. ‘‘సృజనాత్మకత భరితమైన మీ కాల్పనిక వ్యథ గురించి ఈ మూడు వ్యాఖ్యలు చాలా? ఇంకా కావాలా?’’ అంటూ తన కౌంటర్ను ముగించారు. సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు కౌంటర్ ట్వీట్ ఎక్స్లో వైరల్గా మారింది. చంద్రబాబు నీచ రాజకీయం గురించి తన కోడలుకు అర్థమయ్యేలా చెప్పారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
దొరసాని శ్రీమతి నారా బ్రహ్మణి గారు,
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) September 11, 2026
మీరు తెలుగు చదవగలరో లేదో తెలియదు గానీ, మీరు మీ👇ఈ పోస్ట్ ద్వారా వ్యంగ్యాన్ని, హాస్యాన్ని సమ పాళ్లలో బ్రహ్మాండంగా పండించారు. అదెలా అంటారా?
1. రెండో లేదా ఇరవై రెండో ఎకరాలతో 1970వ దశకంలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, నేడు దేశంలోనే అత్యంత సంపన్న… https://t.co/iVWV9XB9E7 pic.twitter.com/fJqicEZAZV








