ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) మార్కాపురం (Markapuram) జిల్లా రాయవరం (Rayavaram) సమీపంలో గురువారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన ప్రమాదం జరిగింది. పలకల క్వారీల మలుపు వద్ద కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ లారీని (Tipper Lorry), ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగి క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
ప్రమాదం ఎలా జరిగింది?
తెలంగాణలోని (Telangana) జగిత్యాల (Jagtial) నుంచి ఆంధ్రప్రదేశ్లోని పామూరు/కలికిరి వైపు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు (Harikrishna Travels Bus), ఉదయం 6:00 – 6:30 గంటల మధ్య రాయవరం వద్ద ఉన్న క్వారీ మలుపు వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బస్సు ముందు భాగంలో ఉన్న సుమారు 13 మంది ప్రయాణికులు మంటలు చెలరేగిన వెంటనే కిందకు దూకి ప్రాణాలు దక్కించుకోగా, వెనుక సీట్లలో ఉన్నవారు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) March 26, 2026
ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం.. 10 మంది సజీవ దహనం
మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
క్షణాల్లోనే మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైన బస్సు, లారీ
ప్రమాదంలో 10 మంది సజీవ దహనం… pic.twitter.com/vcbC4gCfSz
ఇప్పటివరకు 13 మంది మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సుమారు 22 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. వీరిని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో అధిక శాతం కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.









