జనసేన ఎంపీ కుమారుడు లింగమనేని సంజూష్ నడిపిన ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టడంతో యువతి మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం కారులోని యాంత్రిక లోపం కాదని అధికారులు తేల్చింది. కారు తనిఖీలో ఎలాంటి మెకానికల్ లోపాలు గుర్తించలేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో లింగమనేని సంజూష్ నడిపిన సుమారు రూ.4.5 కోట్ల ఆస్టన్ మార్టిన్ కారును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. బ్రేక్స్, స్టీరింగ్, టైర్లు, వైరింగ్, గేర్స్ సిస్టమ్ తదితర కీలక భాగాలను తనిఖీ చేశారు. అయితే వీటిలో ఎలాంటి యాంత్రిక లోపం గుర్తించలేదని నివేదికలో వెల్లడైనట్లు సమాచారం. దీంతో ప్రమాదానికి మెకానికల్ ఫెయిల్యూర్ కారణం కాదనే నిర్ధారణకు అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కేసులో ఇప్పటి వరకు జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న భారతి ముఖి (26)ని సంజుష్ నడిపిన కారు ఢీకొట్టినట్లు కేసు నమోదైంది. కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన భారతి ముఖి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదం అనంతరం పోలీసులు సంజుష్కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఓ యువతి ప్రాణం తీసిన కేసులో జనసేన ఎంపీ కుమారుడిని స్టేషన్ బెయిల్పై విడుదల చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా కారులో ఎలాంటి యాంత్రిక లోపం లేదని అధికారులు నివేదిక ఇవ్వడంతో కేసులో కీలక అంశం స్పష్టమైనట్లు తెలుస్తోంది.








