తెలుగు సినీ పరిశ్రమ (Telugu Film Industry)లో విషాదం నెలకొంది. విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) (83) కన్నుమూశారు (Passed Away). గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ (Hyderabad)లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో విలన్, కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కోటా, తెలుగు సినిమాకు చెరగని ముద్ర వేశారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగింది. పలువురు సినీ ప్రముఖులు తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
కోటా శ్రీనివాసరావు ప్రస్థానం
1942 జూలై 10న కంకిపాడు (Kankipadu)లో జన్మించిన కోటా శ్రీనివాసరావు, బాల్యం నుంచే నాటకాలపై ఆసక్తి కలిగి ఉండేవారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పనిచేసిన ఆయన, 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో దర్శకుడు క్రాంతి కుమార్ అందించిన అవకాశంతో సినీ రంగంలో అడుగుపెట్టారు. ‘ప్రతిఘటన’ చిత్రంతో విలన్గా గుర్తింపు పొందిన కోటా, ‘అహ నా పెళ్ళంట’తో తిరుగులేని నటుడిగా స్థిరపడ్డారు.
బాబు మోహన్తో కలిసి దాదాపు 60 చిత్రాల్లో నటించిన ఆయన, కామెడీ జోడీగా “కోటా-బాబు మోహన్ జంట అంటే సినిమా హిట్” అనే టాక్ను సృష్టించారు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాత, అవినీతి నాయకుడు, కామెడీ విలన్ వంటి వైవిధ్యమైన పాత్రలతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2015లో పద్మశ్రీ, తొమ్మిది నంది అవార్డులతో సహా ఎన్నో గౌరవాలను అందుకున్న కోటా, ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణల తర్వాత ఆ లోటును భర్తీ చేసిన నటుడిగా గుర్తింపు పొందారు.
కోటా వ్యక్తిగత జీవితం..
కోటా శ్రీనివాసరావు 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు, వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు (కోటా ప్రసాద్) ఉన్నారు. 2010లో కొడుకు ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మరణించడం కోటాకు తీవ్ర మానసిక వేధనకు గురయ్యారు. రాజకీయంగా కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పనిచేసిన కోటా, తన నటనతో అలీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు అందరి మన్ననలు పొందారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో లోటు తీరనిదని, ఆయన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో అభిమానులు “కోటా గారు, మీ నటన మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అంటూ నివాళులు అర్పిస్తున్నారు.








