జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోడికుంట భూముల కబ్జా వివాదం చిలికిచిలికి గాలివానగా మారుతోంది. రంగారెడ్డి జిల్లా జన్వాడ వద్ద పవన్ కళ్యాణ్ 10 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఓ జర్నలిస్ట్ బయటపెట్టగా, అది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కోడికుంట భూముల కబ్జా జరిగింది వాస్తవమేనంటూ తెలంగాణ రాజకీయ నాయకులు నిర్దారిస్తున్నారు.
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలతో మరోసారి ఈ భూముల వివాదం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాను తీవ్రంగా బాధపడ్డానని చెప్పిన పవన్ కళ్యాణ్, అదే దుఃఖంతో తెలంగాణలో భూములు కొనుగోలు చేశారని కవిత సెటైర్లు పేల్చారు. ముఖ్యంగా కోడికుంట చెరువుకు సంబంధించిన 10 ఎకరాల శిఖం భూమిని కొనుగోలు చేశారని, ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, ఆ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కవిత ఆరోపించారు. మొత్తం భూమిలో కొంత భాగాన్ని మాత్రమే శిఖం భూమిగా చూపించి, మిగతా భూమిని మాగాణిగా నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. మొత్తం 10 ఎకరాలు శిఖం భూమేనని, వెంటనే ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని, సంబంధిత భూములపై ఉన్న కంచెలను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కవిత కోరారు.








