టీడీపీ కుట్ర బ‌ట్ట‌బ‌య‌లు.. ‘జావా డిస్కవరీ’పై రచయిత ఫైర్!

టీడీపీ కుట్ర బ‌ట్ట‌బ‌య‌లు.. 'జావా డిస్కవరీ'పై రచయిత ఫైర్!

రాజకీయ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ డాక్యుమెంటరీలను కూడా వక్రీకరిస్తూ ప్రత్యర్థులపై బురదజల్లే ప్రయత్నాలు వికటించాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై వచ్చిన ఒక కథనంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును బలవంతంగా ఇరికించేందుకు జరిగిన కుట్రను, అసలు రచయిత, సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి స్వయంగా బట్టబయలు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అసలేం జరిగింది?
సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి 2021లో ‘బ్లడ్ శాండర్స్’ (Blood Sanders) పేరుతో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఒక సమగ్ర పరిశోధనాత్మక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగా 2023లో ‘ప్లానెట్ కిల్లర్స్’ (Planet Killers) పేరుతో ఒక అంతర్జాతీయ డాక్యుమెంటరీ రూపొందింది. అయితే, తాజాగా ‘జావా డిస్కవర్’ (Java Discover) అనే యూట్యూబ్ ఛానల్, ఈ డాక్యుమెంటరీని రీ-ఎడిట్ చేస్తూ ఒక కథనాన్ని ప్రసారం చేసింది.

జగన్ పేరు ఇరికించే ప్ర‌య‌త్నం
ఒరిజినల్ డాక్యుమెంటరీలో ఎక్కడా లేని విధంగా, ఈ కొత్త కథనంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావనను తీసుకురావడం వివాదానికి దారితీసింది. ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీలో లేని అంశాలను, తాను తన పుస్తకంలో రాయలేదని రచయిత సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉద్దేశాలతోనే ఈ వీడియోను ఎడిట్ చేసి, అందులో జగన్ పేరును చేర్చినట్లు ఆయన ఆరోపించారు.

రచయిత సీరియస్
తన పరిశోధనను తప్పుదారి పట్టిస్తూ, తాను చెప్పని విషయాలను ప్రసారం చేయడంపై ఉడుముల సుధాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ.. ‘జావా డిస్కవర్’ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. “నేను రాయనటువంటి, నా పరిశోధనలో లేని అంశాలను నా పేరుతో ప్రసారం చేయడం అనైతికం” అని మండిపడ్డారు.

టీడీపీ కుట్ర ప్రయత్నం బట్టబయలు
ఈ తప్పుడు డాక్యుమెంటరీ బయటకు వచ్చిన వెంటనే, తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలు దీనిని విపరీతంగా ప్రచారం చేశాయి. జగన్ మోహన్ రెడ్డికి ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేశారు. అయితే, అసలు రచయిత సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెల్లడించడంతో, ఇది టీడీపీ పన్నిన కుట్ర అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు కూడా ఈ వక్రీకరణపై మండిపడుతున్నారు. రాజకీయాల కోసం ఒక జర్నలిస్టు ఏళ్ల తరబడి చేసిన కష్టాన్ని, అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపును కేవ‌లం ప్ర‌త్య‌ర్థుల‌పై బుర‌ద‌జ‌ల్లేందుకు స్వార్థ రాజ‌కీయాల కోసం వాడుకోవడం దారుణమని అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment