2026 టీ20 వరల్డ్కప్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ గ్రూప్ మ్యాచ్ నిర్వహణపై ఇప్పటికీ స్పష్టత రాలేకపోయినా, ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
పాకిస్థాన్ టీ20 వరల్డ్కప్లో పాల్గొంటుందని ప్రకటించినప్పటికీ, ఇండియాతో జరిగే గ్రూప్ మ్యాచ్కు మాత్రం దూరంగా ఉండాలని ఆ దేశ ప్రభుత్వం గతంలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వెనుక బంగ్లాదేశ్కు మద్దతుగా నిలవడమే కారణమని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. భద్రతా కారణాలతో భారత్లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తొలగించడాన్ని పాకిస్థాన్ వ్యతిరేకించింది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా లాహోర్లో PCB అధికారులతో పాటు BCB అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్తో కూడా కీలక భేటీ నిర్వహించారు. బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించడంలో ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటించిందని PCB ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ తీవ్రంగా విమర్శించారు. బంగ్లాదేశ్కు జరిగిన అన్యాయంపై పరిష్కారం చూపాల్సిందేనని పాకిస్థాన్ స్పష్టం చేసింది.
బంగ్లాదేశ్ అంశమే కీలకం
భారత్–పాక్ మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్ వెనక్కి తగ్గాలంటే, బంగ్లాదేశ్కు నష్టం కలగకుండా చూడాలని PCB డిమాండ్ చేస్తోంది. బంగ్లాదేశ్పై ఎలాంటి నిషేధాలు లేదా శిక్షలు విధించకూడదని, టోర్నీలో పాల్గొంటే వచ్చే ఆదాయాన్ని వారికి అందించాలని కోరుతోంది. అంతేకాదు, భారత్తో కలిసి 2031 వన్డే వరల్డ్కప్కు సహ ఆతిథ్య దేశంగా ఉన్న బంగ్లాదేశ్ హోదాకు ఎలాంటి భంగం కలగకూడదన్న హామీని కూడా పాకిస్థాన్ కోరుతోంది. ఇదే సమయంలో, ఐసీసీ ఆదాయ పంపిణీ విధానంపై కూడా చర్చలు జరపాలని PCB కోరినట్లు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ షేర్ మోడల్ 2027 వరకు కొనసాగనుండగా, దానిపై పునఃసమీక్ష అవసరమని పాకిస్థాన్ అభిప్రాయపడుతోంది.
మ్యాచ్ జరిగే అవకాశంపై ఆశలు
ఈ అంశాలపై ఐసీసీ–PCB మధ్య కొంత మేర ఏకాభిప్రాయం కుదరుతున్న నేపథ్యంలో, ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ జరగవచ్చన్న ఆశలు పెరుగుతున్నాయి. అయితే, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చలు కొనసాగుతున్నాయని వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే రెండు జట్లు తమ తొలి గ్రూప్ మ్యాచ్ల్లో విజయం సాధించాయి. పాకిస్థాన్ మంగళవారం USAతో తలపడనుండగా, భారత్ గురువారం నమీబియాతో ఆడనుంది. ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ జరిగితే, అది వరల్డ్కప్కే ప్రధాన ఆకర్షణగా మారనుంది.
ఇదిలా ఉండగా, భారత్–పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణ లేదా ఆటగాళ్ల మధ్య హ్యాండ్షేక్లపై ఎలాంటి షరతులు లేవని PCB ఖండించింది. మొత్తానికి ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న హై-వోల్టేజ్ మ్యాచ్ జరగుతుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.








ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్