హైదరాబాద్లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 9 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కాలనీలోని ఎఫ్ బ్లాక్లో నివసించే హాజిజ్ అబ్దుల్ అనే వ్యక్తి బాలికకు ముద్దు పెట్టడం, అనుచితంగా తాకినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు సమాచారం. వాటిని చూసిన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటన అనంతరం ఆగ్రహానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి నిందితుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన హాజిజ్ అబ్దుల్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కుల్సుంపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను సేకరిస్తూ బాలికపై వచ్చిన ఆరోపణలు, నిందితుడిపై జరిగిన దాడి, అతని మరణానికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.








