‘హిట్‌మ్యాన్’ ఆటకు గంభీర్ బ్రేక్? లార్డ్స్ వన్డే ఆఖరి మ్యాచ్ కాబోతోందా!

'హిట్‌మ్యాన్' ఆటకు గంభీర్ బ్రేక్? లార్డ్స్ వన్డే ఆఖరి మ్యాచ్ కాబోతోందా!

Summarize with AI

భారత క్రికెట్‌లో ఒక శకం ముగియబోతోందా? వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్‌గా పేరొందిన ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలకబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ క్రీడా మీడియా కథనాలు.

లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జూలై 19న ఆదివారం ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మ కెరీర్‌లో భారత్ తరపున ఆడే ఆఖరి మ్యాచ్ కానుందనే వార్త ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. దీనికి తోడు రోహిత్ శర్మ ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే లండన్‌ చేరుకోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది.

2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమిండియాను సరికొత్తగా నిర్మించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. యశస్వి జైస్వాల్ లాంటి యువ ఓపెనర్లకు తగినన్ని అవకాశాలు ఇచ్చి వచ్చే వరల్డ్ కప్ నాటికి వారిని సిద్ధం చేయాలనేది గంభీర్ వ్యూహంగా చెబుతున్నారు. అయితే, మరో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్, ఫామ్ పరంగా జట్టులో కొనసాగుతుండగా, రోహిత్ శర్మ విషయంలో మాత్రం గంభీర్ అండ్ కో భిన్నంగా ఆలోచించడం విశేషం. ఈ నిర్ణయం పట్ల రోహిత్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు స‌మాచారం.

నిజానికి రోహిత్ శర్మకు 2027 వన్డే ప్రపంచకప్ ఆడి, ఎలాగైనా ఆ ట్రోఫీని ముద్దాడాలనే బలమైన కోరిక ఉందనేది జగమెరిగిన సత్యం. 2024లో టీ20 వరల్డ్ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా రోహిత్‌కు దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే టీ20లు (జూన్ 29, 2024), టెస్ట్ క్రికెట్ (మే 7, 2025) నుంచి రిటైర్ అయిన రోహిత్, కేవలం వన్డేల కోసమే తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ వచ్చాడు.

కానీ సెలెక్టర్ల నుంచి మద్దతు లభించకపోవడం, గౌరవప్రదంగా తప్పుకోవడమే మంచిదనే భావనతోనే లార్డ్స్ వన్డే తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాడని టాక్ నడుస్తోంది.

రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం.. సోషల్ మీడియాలో గంభీర్‌పై ట్రోల్స్
ఈ పరిణామాలపై రోహిత్ శర్మ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన గొప్ప ఆటగాడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఒక లెజెండరీ ప్లేయర్‌ను ఇలా అర్ధాంతరంగా జట్టు నుంచి తప్పించేలా ఒత్తిడి తీసుకురావడం ఏంటని గౌతమ్ గంభీర్‌, సెలెక్టర్ల తీరుపై మండిపడుతున్నారు. లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయితే.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఓపెనర్ ప్రస్థానం ముగిసినట్లే అంటున్నారు క్రీడాభిమానులు.

Join WhatsApp

Join Now

Leave a Comment