సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ

సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ

Summarize with AI

మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైతుల సమస్యలను లేఖ‌లో ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో నూనె గింజల ఉత్పత్తికి పెద్ద ప్రోత్సాహం ఇచ్చామని, రైతుబంధు మరియు సబ్సిడీలతో పంటలను వేయడానికి మద్దతు కల్పించామని ఆయన గుర్తుచేశారు. అప్పటి ప్రణాళికా బద్దమైన చర్యల వల్లే నేడు తెలంగాణలో పెద్ద ఎత్తున సన్‌ఫ్లవర్ పంటలు సాగుతున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.

అయితే, ఇప్పుడు సన్‌ఫ్లవర్ పంట కోతకు వచ్చినా, గింజల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా మారిందన్నారు. దళారుల చేతుల్లో రైతులు రూ. 5,500 నుంచి రూ. 6,000 ధరకు క్వింటాల్ విక్రయిస్తున్న దుస్థితి ఎదుర్కొంటున్నారని, మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

“రైతుల కష్టం మీరు చూడగలరా?”
బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో నాఫెడ్ ద్వారా రూ. 7,280 మద్దతు ధర ప్రకటించి, సన్‌ఫ్లవర్ గింజల కొనుగోలు జరిగిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం రైతులకు తీవ్రమైన నష్టం తెచ్చిందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

“దళారులకు విక్రయించడం వల్ల క్వింటాల్‌కు రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు నష్టపోతున్నారు రైతులు. మీ అలసత్వం వల్ల తెలంగాణ వ్యవసాయం తిరోగమన దిశలో పయనిస్తోంది. ఇప్పటికైనా కళ్లుతెరిచి, వెంటనే రాష్ట్రవ్యాప్తంగా సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాను” అని హరీష్ రావు లేఖలో స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment