ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) మహిళలపై (Women) జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో (Guntur District) ఒక మహిళను వివస్త్రను చేసిన అమానుష ఘటన సృష్టించిన కలకలం ఇంకా మరువకముందే.. వైఎస్సార్ జిల్లా బద్వేలులో (Badvel) మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ఒక స్థల వివాదంలో తెలుగుదేశం పార్టీ(TDP) శ్రేణులు ఏకంగా ఒక వృద్ధ మహిళపై (Elderly Woman) దాడికి తెగబడి, ఆమె జాకెట్ (Jacket) చించేసి అనాగరికంగా ప్రవర్తించారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్వేలులో TNSF జిల్లా అధ్యక్షుడు,టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) మాధవిరెడ్డి తిరుమలేశ్ (Madhavi Reddy Tirumalesh) ముఖ్య అనుచరుడు బొజ్జల తిరుమలేశ్ (Bojjala Tirumalesh) తన అనుచరులు పది మందితో కలిసి ఒక వృద్ధ దంపతుల ఇంటిపై పడ్డారు. ఈ క్రమంలోనే సదరు వృద్ధ దంపతులు నివసిస్తున్న ఇల్లు, స్థలం తనదంటూ తిరుమలేశ్ గ్యాంగ్ రాడ్లు, కర్రలు, సుత్తులతో వచ్చి తీవ్రంగా బెదిరింపులకు దిగింది.
ఈ గొడవలో వృద్ధ దంపతులను రక్షించేందుకు ప్రయత్నించిన సదరు వృద్ధ మహిళపై, ఆమె భర్తపై ఈ గ్యాంగ్ విచక్షణారహితంగా దాడి చేసింది. అంతటితో ఆగక ఆమెపై భౌతిక దాడికి దిగి, జాకెట్ చించేసి అరాచకం సృష్టించింది. “మేము గత 18 ఏళ్లుగా ఇదే స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నాం. అన్ని ఆధారాలు మా దగ్గరే ఉన్నాయి. అధికార బలంతో ఈ భూమి తమదంటూ దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. రాడ్లు, సుత్తులతో వచ్చి మమ్మల్ని చంపేస్తామని బెదిరించారు” అని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో, ఆ గ్యాంగ్ అక్కడి ఇంటి గోడను పగలగొట్టి, బాధితులను హెచ్చరిస్తూ వెనుతిరిగింది.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వ పెద్దలు, వారి సొంత పార్టీ శ్రేణులే ఇలాంటి బరితెగింపు చర్యలకు పాల్పడడం సంచలనంగా మారింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఈ ఘటనపై తక్షణమే స్పందించి, వృద్ధురాలిపై దౌర్జన్యానికి దిగిన బొజ్జల తిరుమలేశ్ (Bojjala Tirumalesh) , అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.








