మహబూబాబాద్: రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్గా శిక్షణ పొందుతున్న ఓ యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కేఎస్ఎన్ రెడ్డి ఇంటి సమీపంలో అద్దెకు ఉండే దోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల చిన్నకుమార్తె దోలి సంధ్య (28) స్థానిక మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్గా విధులు నిర్వర్తించింది.
అనంతరం గ్రూప్-2 రాయగా డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం పొందింది. ఖమ్మం జిల్లాలో శిక్షణ పొందుతూ ఉద్యోగం చేస్తోంది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొంతసేపటికి సంధ్య ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన తల్లి పద్మ చుట్టుపక్కల వారికి, తండ్రి వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చింది. అనంతరం వెంకటేశ్వర్లు పోలీసులకు విషయాన్ని తెలిపారు.
సంఘటనా స్థలాన్ని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, క్రైం, టౌన్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, సూరయ్య సందర్శించి సంధ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు అనంతరం ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. మృతురాలు సంధ్య ఇటీవల ఒకే సమయంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి మన్ననలు పొందింది.









రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది