మామిడి రైతుకు అన్యాయం.. సీఎంకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ

మామిడి రైతుకు అన్యాయం.. సీఎంకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ

ఏపీలో మామిడి రైతులు గిట్టుబాటు ధ‌ర లేక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏడాదంతా క‌ష్ట‌ప‌డి పండించిన పంటను చౌక ధ‌ర‌ల‌కు తెగ‌న‌మ్ముకోలేక క‌న్నీరు పెట్టుకుంటున్నారు. గ‌తేడాది మామిడి రైతులు పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేక రోడ్ల ప‌డ‌బోసిన ఉదాంతాలు కూడా ఉన్నాయి. ఏడాది గ‌డిచినా మామిడి రైతుకు ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి భ‌రోసా అంద‌క‌పోవ‌డంతో కూట‌మిలోని బీజేపీ చీఫ్ మాధ‌వ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

సంక్షోభంలో కూరుకుపోయిన వేలాది రైతు కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక అత్యవసర లేఖ రాశారు. మార్కెట్‌లో మామిడి పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని వెంట‌నే ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోందని, ఈ పంట కోసం రైతులు ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు భారీగా పెట్టుబడులు పెట్టారని గుర్తుచేశారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్‌లో కనీస ధర కూడా లభించకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో మామిడి పండ్లకు రూ.4 కూడా ధర లభించడం లేదని, ఈ దారుణమైన ధరల వల్ల రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పులపాలవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గిట్టుబాటు ధరలు లేక చిత్తూరు జిల్లాలో వేలాది మామిడి రైతు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలి. అన్నదాతల ప్రయోజనాల కోసం, వారికి న్యాయం జరిగే వరకు బీజేపీ నిరంతరం పోరాడుతుందని కూట‌మిలోని పార్టీ అధ్య‌క్షుడు సూచించ‌డం సంచ‌ల‌నంగా మారింది. మరి ఈ లేఖపై సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో, మామిడి రైతులకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment