భారత్లో క్రికెట్ అభిమానులకు మరో అరుదైన అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బిగ్బాష్ లీగ్ (BBL) 2026 తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నిర్వహించనున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ మ్యాచ్లను కూడా భారత్లో నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్బర్గ్ తెలిపారు. బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB)తో తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని, భారత్లో టెస్టు క్రికెట్కు ఉన్న విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకుని అన్ని అవకాశాలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం భారత్లో యాషెస్ నిర్వహణపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని టాడ్ గ్రీన్బర్గ్ స్పష్టం చేసినప్పటికీ, భవిష్యత్తులో దీనిపై చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్లలో టెస్టు క్రికెట్కు అపారమైన ఆదరణ ఉందని, ఆ ఆదరణను మరింత విస్తరించే దిశగా క్రికెట్ ఆస్ట్రేలియా కృషి చేస్తోందన్నారు. మరోవైపు, వచ్చే ఏడాది యాషెస్ సిరీస్ షెడ్యూల్ను ఇప్పటికే ఈసీబీ ప్రకటించగా, 2029-30 యాషెస్ సిరీస్ ఆతిథ్య హక్కులు క్రికెట్ ఆస్ట్రేలియా వద్ద ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో భారత్లో యాషెస్ మ్యాచ్లు జరిగే అవకాశంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.







