ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ‘మందుల కష్టం'(Medicine Shortage) మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 176 రకాల అత్యవసర మందులు అందుబాటులో లేవని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఆస్పత్రులే కాకుండా, జిల్లాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లలో (Central Drug Stores) కూడా బఫర్ నిల్వలు నిండుకోవడంతో సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది.
ఆస్పత్రుల్లో మందుల కొరతను కప్పిపుచ్చేందుకు, కేవలం స్టాక్లో అందుబాటులో ఉన్న మందులను మాత్రమే చీటీలో రాయాలని ప్రభుత్వం వైద్యులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల రోగులకు కావాల్సిన పూర్తిస్థాయి చికిత్స అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అత్యధికంగా వినియోగంలో ఉన్న 5 రకాల కీలక మందులపై నిశిత పరిశీలన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి వాడకం, సరఫరా, డిమాండ్పై డేటా ఆధారిత విశ్లేషణ చేయడానికి ఐదుగురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించింది.
విశాఖ జీజీహెచ్లో..
మరోవైపు, మందుల కొరతకు కారణం కేవలం సరఫరా లోపమే కాదు, కొన్ని చోట్ల అవసరానికి మించి మందులను ప్రిస్క్రిప్షన్లలో రాయడమేనని అధికారులు భావిస్తున్నారు. విశాఖపట్నం(Visakhapatnam) కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH/GGH) సహా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అవసరానికి మించి రోగులకు మందులను సిఫార్సు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనివల్ల నిల్వలు త్వరగా కరిగిపోతున్నాయని, అనవసరమైన మందుల వాడకం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడటమే కాకుండా మందుల కృత్రిమ కొరత ఏర్పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
రోగుల అవస్థలు
ప్రభుత్వ ఆస్పత్రులలో మందులు లేకపోవడంతో పేద రోగులు ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. వేల రూపాయలు ఖర్చు చేసి బయట మందులు కొనలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. “ఒకవైపు ఉచిత వైద్యం అని చెబుతూనే, మరోవైపు 170కి పైగా మందులు అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. తక్షణమే డ్రగ్ స్టోర్లలో నిల్వలను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.” అని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు.








