ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. సుమారు 80కి పైగా అజెండా అంశాలతో అత్యంత సుదీర్ఘంగా సాగుతున్న ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, రాజధాని నిర్మాణం, ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది.
అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో భాగంగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫైవ్ స్టార్ హోటళ్లు, అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు భారీగా ప్రోత్సాహకాలకు ప్రకటించనుంది. ఉండవల్లి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.426 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలపనుంది.
విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లోనూ పర్యటక ప్రాజెక్టులపై కేబినెట్లో చర్చించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై నిర్ణయం తీసుకోనున్నారు. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.








