ఎలాగైనా తెలంగాణలోనూ (Telangana) తమ ఉనికిని నిరూపించుకోవాలని తహతహలాడుతున్న కూటమి పార్టీలకు బీజేపీ(BJP) షాక్ ఇచ్చింది. ఏపీలోని (AP)జోరుతో తెలంగాణలోనూ తమకు అడ్డు లేదనుకున్న రాజకీయ పార్టీలకు కాషాయ పార్టీ ఖంగుతినిపించే వార్త ప్రకటించింది. త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది.
రాబోయే ఎన్నికల్లో (Upcoming Elections) బీజేపీ ఎలాంటి పొత్తులు (Alliances) లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసే ఆలోచన లేదని, సొంత బలంతో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలోపేతానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇదే సమయంలో యూనిఫార్మ్ సివిల్ కోడ్ (UCC) అమలుపై తమ నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించిన ఆయన, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దశలవారీగా అమలు చేస్తామని వెల్లడించారు. అమిత్ షా తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయగా, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి.








