తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై టీటీడీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశ విదేశాలనుంచి వచ్చే భక్తులతో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ పరిగణనలోకి తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది.
నిర్ణయం అమలు కాలేదని విమర్శ
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుంటామని టీటీడీ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆ నిర్ణయం అమల్లోకి రాకపోవడంపై తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్న టీటీడీ, ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం ఆదేశించినా, పాలకమండలి నిర్ణయం తీసుకున్నా, టీటీడీ అధికారులు అమలు చేయకపోవడం దేనిని సూచిస్తుందో తెలియడంలేదని వ్యాఖ్యానించారు.
అవసరమైతే తిరుమలలోనే తేల్చుకుంటాం
తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించిన రఘునందన్ రావు, పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించి, తక్షణమే నిర్ణయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో కూడా సిఫార్సు లేఖలు అందిస్తామని, అయినా పరిగణనలోకి తీసుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా టీటీడీ అనుసరిస్తున్న తీరును విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రం తరహాలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.