సర్వీస్ ముగించుకొని రిటైర్డ్ అయిన ఉద్యోగికి సంబంధం లేని శాఖలో రెండు కీలక పదవి కట్టబెట్టారు. మూడు వారాల ముందు ఒక పదవి, ఆ తరువాత దానికి మించిన పదవిని అప్పగించారు. వైద్య విభాగానికి చెందిన అధికారి ఇంధన శాఖలో కీలక పదవి కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. దీంతో కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్డీసీఏపీ (New & Renewable Energy Development Corporation of Andhra Pradesh) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కమలాకర్ బాబును చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ఆంధ్ర ప్రదేశ్ పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ)కి ఓఎస్టీగాను, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఎండీ (ఎస్ఏసీ)గానూ ఉన్నారు. జనవరి 21న కమలాకర్బాబును ఏపీపీసీసీ వోఎస్టీగా నియమించగా, మూడు వారాలకే ఆ ఉత్తర్వులను రద్దు చేసి, ఎన్ఆర్డీసీఏపీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు.
మూడు వారాల్లోనే రూ.లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను నడిపించే నెడ్ క్యాప్ బాధ్యతలను కమలాకర్ బాబుకు అప్పగించడంపై ప్రభుత్వ వర్గాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు చార్జింగ్ స్టేషన్లు, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టు లతో పాటు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు సైతం నెడ్ క్యాప్ పరిధిలోనే ఉంటాయి. వీటి పర్యవేక్షణ బాధ్యతను హెల్త్ డిపార్టుమెంట్కు చెందిన రిటైర్డ్ ఆఫీసర్ కమలాకర్ బాబుకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కమలాకర్బాబు ప్రభుత్వంలోని ఓ ప్రధాన అధికారికి సన్నిహితుడు కావడం వల్లే ఈ నియామకం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.









