కొందరు రాజకీయ నాయకులకు అనతికాలంలోనే, తమ ప్రమేయమే ఏమీ లేనిచోట కొన్నిసార్లు గుర్తింపులు, పదవులు దక్కుతుంటాయి. అది వారికి దక్కిన అదృష్టంగా భావిస్తే పర్లేదు. కొంతమంది మనం కష్టపడ్డాం కాబట్టే తనకు ఆ పదవి దక్కిందని ఓ రకమైన విర్రవీగేతనం ప్రదర్శిస్తుంటారు. కానీ, పొంగిన పాలు పొయ్యిపాలు అని వారికి ఆ గౌరవ మర్యాదలు చేజార్చుకునే వరకు అర్థం కాదు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే కనుమూరు రవిచంద్రారెడ్డి (Kanumuru Ravichandra Reddy) అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ(YSRCP) అనుకూల శత్రువులతో చేతులు కలిపి పదవులిచ్చిన పార్టీపై, వైఎస్ జగన్పై (YS Jagan) విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
అదెలాగంటే.. రాష్ట్ర విభజన తరువాత నాయకత్వలేమితో ఊగిసలాడుతున్న కాంగ్రెస్ పార్టీలో(Congress Party) ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన కనుమూరు రవిచంద్రారెడ్డి.. 2019 జనవరి 25వ తేదీన ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పటికే ప్రజాసంకల్ప యాత్ర పూర్తయింది.. జగన్ అధికారంలోకి వస్తారని ప్రజలు, సర్వేలు చెబుతున్నాయి. ఆ సమయంలో తన జిల్లా వాసి అయిన విజయసాయిరెడ్డి ద్వారా వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
నాలుగు నెలల్లోనే చైర్మన్ పదవి
2019లో జనమిచ్చిన తీర్పుతో మే 30న జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టారు. అంతకు సుమారు నాలుగు నెలల ముందు, 2019 జనవరి 25న వైసీపీలో చేరిన కనుమూరి రవిచంద్రారెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ (Andhra Pradesh Trade Promotion Corporation) పదవి దక్కింది. ఇంత త్వరగా అంతటి పదవి దక్కడం ఎవరైనా అదృష్టంగానే భావిస్తారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించిన రవిచంద్రారెడ్డి.. 2024లో అధికార మార్పు జరిగిన తరువాత రాజీనామా చేసిన గంటలోనే బీజేపీ(BJP) చేరి అవకాశవాద రాజకీయ నాయకుడిగా చీత్కరింపులకు గురయ్యాడు.
ఇదే రవిచంద్రారెడ్డి.. వైసీపీలో కొనసాగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూనే పార్టీ కోసం పనిచేస్తున్నానని చెప్పుకునేందుకు ఒక ఆన్లైన్ పేపర్ స్టార్ట్ చేశాడు. వైసీపీ అధికారిక వెబ్సైట్ నుంచి వచ్చే కంటెంట్ను కాపీ చేసుకొని పేపర్లో ప్రచురించి, ఎడిటర్గా కొత్త అవతారం ఎత్తి వాట్సాప్ ద్వారా ప్రచారం మొదలుపెట్టాడు.
యాడ్స్ కోసం అధికారులపై వేధింపులు
తాను నడుపుతున్న కాపీ పేస్ట్ కంటెంట్ ఆన్లైన్ పేపర్కు యాడ్స్ రూపంలో రెవెన్యూ జనరేట్ చేసుకోవాలని ప్రయత్నంలో భాగంగా సమాచార శాఖను సంప్రదించాడు. ఐ అండ్ పీఆర్ (I&PR)ద్వారా తనకు ప్రభుత్వ కార్యక్రమాల యాడ్స్ ఇవ్వాలని ఆ శాఖ అధికారులను రవిచంద్రారెడ్డి పదేపదే సంప్రదించాడు. నిబంధనలు అనుమతించవని అధికారులు చెప్పినా వినిపించుకోకుండా.. అధికార పార్టీ నాయకుల ద్వారా ప్రకటనల కోసం సిఫార్సులు చేయించుకోవడం, ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
ఎన్నికలు పూర్తయి. రాష్ట్రంలో అధికార మార్పు జరిగింది. ఆ తర్వాత వైసీపీ నిర్ణయాలకు భిన్నంగా రవిచంద్రారెడ్డి మాట్లాడటం ప్రారంభించాడు. ఇదంతా అతను వైసీపీలో చేరడానికి కారణమైన వ్యక్తి సూచనల మేరకు వ్యవహరించేవారని విమర్శలు అప్పట్లో వచ్చాయి. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా రవిచంద్రారెడ్డి మాట్లాడటంతో వైసీపీ సోషల్ మీడియా వర్గాలు అతనిపై ఎదురుదాడి చేశాయి.
అధినేత ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని రవిచంద్రారెడ్డిపై పార్టీ నాయకత్వం గుర్రుగా ఉన్న సమయంలో వైసీపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ నేతలను కలిసే ప్రయత్నంలో భాగంగా క్యాడర్లో అపోహలను పోగొట్టేందుకు, తానొక సచ్ఛీలుడు అని నిరూపించుకుంటానని పార్టీ పెద్దలను ఒప్పించి ఓ ప్రెస్మీట్ పెట్టాడు. అయితే రవిచంద్రారెడ్డి మాటలను క్యాడర్ పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. వైఎస్ జగన్ సిద్ధాంతాలకు, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన తనకు మనుగడ కష్టమేనని భావించి.. ప్రెస్మీట్ అనంతరం పార్టీకి రాజీనామా చేశాడు.
వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం గంటలోపే అప్పటి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేరడం సంచలనం సృష్టించింది. ముందుగానే బీజేపీలో చేరాలని ఆ పార్టీ నాయకులతో మంతనాలు జరిపిన రవిచంద్రారెడ్డి ద్వంద్వ వైఖరి వైసీపీకి ముందుగానే తెలుసు అని, అందుకే అతనిపై చర్యలకు పార్టీ వెనకాడలేదన్న చర్చ కూడా అప్పట్లో జరిగింది.
‘సీజన్’కు అనుగుణంగా రాజకీయాలు
ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ అక్కడ కూడా ఆయనకు పెద్దగా ప్రాధాన్యం లేదని, ఎక్కడా విలువ లేకపోవడంతో వైసీపీపై నిరంతరం ఆరోపణలు చేస్తున్నారని రవిచంద్రారెడ్డిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు వెళ్లి.. పదవులు ఇచ్చిన నాయకత్వంపై విధేయత లేకుండా తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రకం అనే ఆరోపణలు రవిచంద్రారెడ్డిపై ఉన్నాయి. అరటి పళ్ల వ్యాపారికి కూడా ఒక సీజన్ ఉంటుందని, కానీ రవిచంద్రారెడ్డికి మాత్రం ఎలాంటి విధేయత, విశ్వసనీయ లేదని తాజాగా విడుదలైన అతని ఇంటర్వ్యూపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ అనుకూల శత్రువుల వద్దకు వెళ్లి పాడ్క్యాస్ట్ల పేరుతో తానొక రాజకీయ స్ట్రాటజిస్ట్గా చెప్పుకునే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో అధికార ప్రతినిధిగా గౌరవం ఇచ్చి, సీనియర్లను కాదని నాలుగు నెలల ముందు పార్టీలో చేరిన అతనికి ఒక కార్పొరేషన్కు చైర్మన్ను చేస్తే.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ రవిచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం అతని రాజకీయ అవకాశవాదానికి, అవివేకానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.








‘టీడీపీలో డబ్బులున్న వారికే సీట్లు’