హిమాలయ దేశం నేపాల్లో(Nepal) ప్రకృతి మరోసారి తీవ్ర రూపం దాల్చింది. చైనా(China) సరిహద్దులోని టిబెట్ (Tibet) ప్రాంతం నుంచి అకస్మాత్తుగా ముంచెత్తిన భారీ వరదల కారణంగా నేపాల్ ఉత్తర ప్రాంతం అతలాకుతలమైంది. భోటే కోషి నదిలో(Bhotekoshi River) ఒక్కసారిగా నీటి మట్టం అసాధారణంగా పెరగడంతో సంచలనాల సృష్టిస్తూ వచ్చిన ఆకస్మిక వరద (Flash Flood) రసువా (Rasuwa) జిల్లాను తీవ్రంగా దెబ్బతీసింది. ఆకస్మిక జల విలయానికి 400 వందలకు పైగా టూరిస్టులు గల్లంతు కాగా, 8 మంది మృతిచెందారు. గల్లంతైన వారిలో 100 మంది భారతీయులు (Indians) ఉన్నట్టుగా సమాచారం.
స్థానికంగా ఎలాంటి వర్షాలు లేకపోయినా, ఎంతో ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా టిబెట్ వైపు నుంచి భారీ ఎత్తున వరద నీరు వచ్చిపడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. 8 నుంచి 10 మీటర్ల ఎత్తున ఎగిసిపడిన వరద ఉప్పెన రసువా జిల్లాలోని తిమురే మార్కెట్(Timure Market), రసువాగధి(Rasuwagadhi), శ్యాబ్రుబేసి (Syabrubesi) వంటి ప్రధాన ప్రాంతాలను ముంచెత్తింది.
ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు కనీసం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 400 వందల మందికి పైగా గల్లంతు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా సరిహద్దు సమీపంలో ఉన్న తిమురే బజార్, కస్టమ్స్ కార్యాలయం పూర్తిగా నీట మునిగాయి. గతంలో పునరుద్ధరించిన రసువాగధి వద్ద ఉన్న ‘ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్’ (స్నేహ వారధి) మళ్లీ వరదలో కొట్టుకుపోయింది.
విధుల్లో ఉన్న అనేక మంది సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు ఆచూకీ లేకుండా పోయారు. తిమురే, శ్యాబ్రుబేసి పోలీస్ స్టేషన్లు కూడా వరద ఉధృతికి దెబ్బతిన్నాయి. ఈ వరదల కారణంగా నేపాల్లోని పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు (ముఖ్యంగా చిలిమే హైడ్రోపవర్ ప్రాజెక్ట్) తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 430 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భోటే కోషి(Bhotekoshi), త్రిశూలి(Trishuli) నదీ పరీవాహక ప్రాంతాల దిగువన ఉన్న రసువా, నువాకోట్, ధాడింగ్, గోర్ఖా మరియు చిత్వాన్ జిల్లాల ప్రజలను అప్రమత్తం చేశారు. నది ప్రాంతాల వైపు వెళ్లవద్దని, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.








