సినిమా ప్రమోషన్స్కు దూరంగా ఉండే విషయంలో నయనతారకు(Nayanthara) ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. రెమ్యునరేషన్ (Remuneration) పెంచినా సరే సినిమా ప్రమోషన్స్కు రానని, అగ్రిమెంట్ చేసుకునే ముందే ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే గతంలో ‘శ్రీరామరాజ్యం’(Sri Ramarajyam) సమయంలో, అలాగే బాపు(Bapu) దర్శకత్వం వహించడం వంటి ప్రత్యేక కారణాలతో ఆమె ప్రమోషన్స్లో పాల్గొన్నారు.
చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’(Sye Raa Narasimha Reddy), ‘గాడ్ఫాదర్’ (Godfather)వంటి సినిమాల్లో నటించినా ఆయా చిత్రాల ప్రమోషన్స్కు ఆమె దూరంగా ఉన్నారు. మరోవైపు నిర్మాతగా మారిన తర్వాత తన సొంత చిత్రం ‘కనెక్ట్’(Connect) కోసం మాత్రం తెలుగు, తమిళం సహా పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రమోషన్స్లో పాల్గొనడంతో అప్పట్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
ఇక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన నయనతార బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్లో చురుగ్గా పాల్గొనడం కూడా చర్చకు దారితీసింది. అయితే ఇటీవల ‘మన శంకర వరప్రసాద్’ (Mana Shankara Varaprasad)కోసం షూటింగ్ ప్రారంభం, ముగింపు సందర్భంగా వీడియోల ద్వారా అభిమానులను ఆకట్టుకున్నారు. తాజాగా ‘టాక్సిక్’(Toxic) ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు నయనతార హాజరు కావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
హీరో యష్ స్వయంగా ఫోన్ చేయడంతోనే ఈ కార్యక్రమానికి వచ్చానని ఆమె వెల్లడించినట్లు సమాచారం. ప్రమోషన్స్పై ఆసక్తి లేకపోవడం కాదని, వాటిలో చురుగ్గా పాల్గొనలేననే భావనతోనే దూరంగా ఉంటానని నయనతార గతంలో వివరించారు. ఇప్పుడు ‘టాక్సిక్’తో(Toxic) ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్కు ఆమె దగ్గరవుతున్న నేపథ్యంలో.. ఇకపై తన రాబోయే సినిమాల విషయంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.








