ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గోడ కూలిపడటంతో మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో బాలుడు గాయపడినట్లు సమాచారం.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్న విద్యా ర్థులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో సాలూరు రెల్లివీధికి చెందిన తుపాకుల అరుణ్ తేజ (15) మృతి చెందాడు. మరో బాలుడు సొండి ఏకాబ్ గాయపడినట్లు తెలుస్తోంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే విద్యార్థుల కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకున్నారు. తమ పిల్లాడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పాఠశాల ప్రాంగణంలోనే మృతదేహంతో ధర్నాకు దిగారు. పాఠశాల గోడ ప్రమాదకరంగా ఉన్నప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలుడి మృతితో పాఠశాల పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మృతితో తల్లి తల్లడిల్లిపోయింది. విద్యా శాఖ నిర్లక్ష్యం కారణంగానే అరుణ్ తేజ చనిపోయాడని కుటుంబ సభ్యుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.








