విజయవాడ (Vijayawada) కృష్ణలంక (Krishnalanka) పోలీస్ స్టేషన్లో (Police Station) గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) లాకప్ డెత్ (Lockup Death) వ్యవహారం ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఒకవైపు హైకోర్టులో (High Court) నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటుండగా, మరోవైపు సాయికృష్ణ పిన్ని, న్యాయవాది కనకదుర్గ (Kanaka Durga) చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ కేసులో మరింత దుమారం రేపుతున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని (Nara Chandrababu Naidu) కలిసిన తర్వాతే ఈ కేసు పూర్తిగా దారి తప్పిందని, సాయికృష్ణ తల్లి(Mother) విజయలక్ష్మి (Vijayalakshmi) పూటకో మాట మాట్లాడుతోందని కనకదుర్గ తీవ్రస్థాయిలో ఆరోపించారు.
ఈ మేరకు సాయికృష్ణ పిన్ని, న్యాయవాది కనకదుర్గ మీడియాతో మాట్లాడుతూ.. “ఈ నెల 22వ తేదీన ఆన్లైన్లో గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించిన వివరాలు చూశాను. అందులో హెబియస్ కార్పస్ పిటిషన్ (Habeas Corpus Petition) విత్డ్రా అని వచ్చింది. వెంటనే ఈ విషయం మా అక్క (సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి)కి ఫోన్ చేసి చెప్పాను. దానికి ఆమె స్పందిస్తూ.. ‘నేను హెబియస్ కార్పస్ పిటిషన్ కాదని, కేవలం సీబీఐ విచారణ వద్దని మాత్రమే చెప్పాను’ అని సమాధానమిచ్చింది.”
“మా సోదరుడు వాసుదేవ్కు (Vasudev) ఈ కేసు బాధ్యతలు అప్పగించారు. కానీ మా అక్కకు నయానో భయానో నచ్చజెప్పి తిరిగి అడ్వకేట్ రిత్వికే కావాలని చెప్పించారు. మా అక్క గంటకో మాట, పూటకో మాట మాట్లాడుతోంది. ప్రస్తుతం పిటిషన్ వేసిన వాళ్లు తప్పుడు పిటిషన్లు వేస్తున్నారు.”
“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Nara Chandrababu Naidu) కలిసినప్పటి నుంచే ఈ కేసు పూర్తిగా తప్పుదారి పట్టింది. అసలు హత్య కేసులో ‘క్వాష్'(Quash) చేయాలని పిటిషన్ వేయడం ఎక్కడైనా చూశామా? కేసును పూర్తిగా పక్కదోవ పట్టిస్తున్నారు. నేటితో ఈ కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఒకవేళ కోర్టు ఈ కేసును డిస్మిస్ చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. మానవ హక్కుల కమిటీ, బార్ అసోసియేషన్, నేను వ్యక్తిగతంగా బాధితుడికి న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాటం చేస్తాం” అని సాయికృష్ణ పిన్ని కనకదుర్గ స్పష్టం చేశారు.
ఊహించని మలుపులు..
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు దర్యాప్తు పురోగతిని పర్యవేక్షిస్తుండగా, కుటుంబ సభ్యులు, వారి తరఫు న్యాయవాదుల మధ్యే ఇలాంటి పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు బయటకు రావడం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. పిటిషన్ల ఉపసంహరణ వెనుక బాహ్య ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతుండగా, కనకదుర్గ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.








