ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరిగిన ప్రతిసారీ ప్రభుత్వ నిర్ణయాలతో పాటు రాజకీయ చర్చలు కూడా హాట్టాపిక్గా మారుతున్నాయి. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) మరోసారి మంత్రుల పనితీరుపై (Ministers Performance) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టీడీపీ(TDP) అనుకూల మీడియా ఛానళ్లలో ప్రసారాలు వెలువడ్డాయి. ముఖ్యంగా వైసీపీ(YSRCP) చేస్తున్న విమర్శలకు మంత్రులు వెంటనే స్పందించడం లేదంటూ సీఎం సీరియస్ అయినట్లు బ్రేకింగ్స్ ప్రసారం చేస్తున్నారు.
రైతుల సమస్యలపై (Farmers Issues) ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను మంత్రులు సమర్థంగా రిప్లయ్లు ఇవ్వడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ మీడియా ప్రసారాల సారాంశం. ప్రభుత్వంపై (Government) ఏదైనా విమర్శ వచ్చిన వెంటనే సంబంధిత శాఖ మంత్రి స్పందించాలని, ప్రతిపక్షానికి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని సూచించినట్లు, మంత్రులు మరింత ప్రోయాక్టివ్గా (Proactively) వ్యవహరించాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రతి కేబినెట్లోనూ వైసీపీ ప్రస్తావనేందుకు?
అయితే కేబినెట్ సమావేశానికి సంబంధించిన మీడియా లీకుల్లో తరచూ వైసీపీ ప్రస్తావన రావడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) వైసీపీకి వచ్చిన సీట్ల సంఖ్యను ప్రస్తావిస్తూ అధికార కూటమి నేతలు తరచూ విమర్శలు చేస్తుంటారు. అలాంటప్పుడు ప్రభుత్వ అత్యున్నత నిర్ణయ వేదిక అయిన కేబినెట్ సమావేశాల్లో అదే పార్టీ వ్యూహాలు, విమర్శలు, కార్యక్రమాలపై పదేపదే చర్చ ఎందుకు జరుగుతోందనే ప్రశ్నలు ప్రతిపక్ష వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
అప్రమత్తతా.. రాజకీయ ఆందోళనా?
ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న విమర్శలపై అధికార పార్టీ అప్రమత్తంగా ఉండటం సహజమైన రాజకీయ వ్యూహమేనని ఒక వర్గం అభిప్రాయపడుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలు, నిరసనలు, ఆందోళనలు చూస్తే.. అది అప్రమత్తత కాదు.. రాజకీయ ఆందోళన అనే వాదన వినిపిస్తోంది.
రాష్ట్రంలో వైసీపీ బలహీనపడుతుందని ప్రభుత్వ కార్యక్రమాల వేదికలపై కూటమి పెద్దలు చెబుతున్నప్పటికీ, ఏకంగా కేబినెట్ భేటీలో ఆ పార్టీ గురించి ప్రతిసారీ ప్రస్తావించడం వైసీపీ ఎంత బలంగా తయారవుతుందో చెప్పకనే చెప్పినట్టు అని ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయం. మంత్రులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లుగా వస్తున్న కథనాలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.








