ఉపాధ్యాయ నియామకాలపై సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నిర్దేశిత అర్హతలు లేకుండా, పారదర్శకమైన నియామక ప్రక్రియను పక్కనపెట్టి ఉపాధ్యాయులను నియమించడం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. అర్హతలు లేని వ్యక్తులను ఉపాధ్యాయులుగా నియమించకూడదని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పరిణామం ఏపీలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ-2025 నియామకాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాలు, టెట్ అర్హత, సర్టిఫికెట్ల పరిశీలన తదితర అంశాలపై ఇప్పటికే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోటీ పరీక్షలు, పారదర్శకమైన ఎంపిక ప్రక్రియ లేకుండా ప్రైవేట్, వెంచర్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నిర్దేశిత అర్హతలు లేని వ్యక్తులను నేరుగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 16లోని సమానత్వం, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల హక్కులకు విరుద్ధమని పిటిషనర్లు వాదించారు.
ఈ పిల్పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
‘అనర్హులను ఎందుకు నియమిస్తున్నారు?’
విచారణ సందర్భంగా అర్హతలు లేని వ్యక్తులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఇలాంటి విధానాల ద్వారా ఎలా చెలగాటమాడతారని ప్రశ్నించారు. నిబంధనలను తప్పించుకునేందుకు కొందరిని ‘ట్యూటర్లు’ తదితర పేర్లతో నియమిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీజేఐ.. ఇలాంటి విధానాలు తరతరాల భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు.
విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్యా హక్కు చట్టం (RTE), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు లేని వ్యక్తులను ఉపాధ్యాయులుగా నియమించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అలాంటి అర్హతలు లేని వ్యక్తులు ఇప్పటికే నియమితులై ఉంటే వారిని సర్వీసులో కొనసాగించే అంశాన్ని కూడా న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు సంబంధిత నియామకాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ ఆదేశాలు ‘రాజేశ్ చౌహాన్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో వెలువడ్డాయి.
మెగా డీఎస్సీపై ఆరోపణల నేపథ్యంలో ప్రాధాన్యం
ఏపీలో మెగా డీఎస్సీ-2025 నియామకాలకు సంబంధించి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై ఇప్పటికే పలు ఆరోపణలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టెట్ అర్హత లేని వారికి పోస్టులు దక్కాయనే ఆరోపణలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పరిశీలనలో అవకతవకలు జరిగాయనే విమర్శలు, కొన్ని సర్టిఫికెట్ల చెల్లుబాటుపై ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆయా ఆరోపణలపై విచారణ, పరిశీలన కొనసాగుతోందని చెబుతోంది. కొన్ని అంశాలపై కమిటీలు ఏర్పాటు చేసి నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అర్హతలు, పారదర్శక నియామక ప్రక్రియ, పోటీ పరీక్షల ప్రాధాన్యంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏపీ డీఎస్సీ వ్యవహారానికి కూడా ప్రాధాన్యం కల్పించాయి.
‘టీచర్ పోస్టు అంటే విద్యార్థుల భవిష్యత్తు’
ఉపాధ్యాయ నియామకాల్లో అర్హతలను పక్కనపెడితే దాని ప్రభావం ఒక్క నియామక ప్రక్రియకే పరిమితం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఉపాధ్యాయుల నాణ్యత నేరుగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు, భవిష్యత్తుతో ముడిపడి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా అర్హతలేని ఉపాధ్యాయుల నియామకాలపై దృష్టి సారించిన నేపథ్యంలో.. ఏపీలో మెగా డీఎస్సీ-2025పై వస్తున్న ఆరోపణలకు కూడా ఇదే ప్రమాణాలు వర్తిస్తాయా? ఆయా నియామకాల్లో అర్హతలు, సర్టిఫికెట్ల పరిశీలన నిబంధనల ప్రకారం జరిగిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత చర్చకు వస్తున్నాయి. మెగా డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు పూర్తి స్థాయి అధికారిక విచారణ, రికార్డుల పరిశీలన, తుది నివేదికలే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.








