నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, విద్యార్థుల ఆందోళనలకు మాజీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు ఉద్రిక్తంగా మారి, పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించారు. ప్రతి విద్యార్థికి ప్రశాంత వాతావరణంలో చదివే హక్కు ఉందని, వారి సంక్షేమమే బలమైన భారతదేశానికి పునాది అని పేర్కొన్నారు. పరస్పర చర్చల ద్వారా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు నీట్ పేపర్ లీక్ అంశం పార్లమెంట్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం సాధారణ చర్చకు సిద్ధమని చెబుతుండటంతో లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలు ప్రధాని నివాసం వైపు మోర్చా నిర్వహించేందుకు యత్నించగా, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. దీంతో నీట్ వివాదం రాజకీయంగానూ, సామాజికంగానూ మరింత వేడెక్కుతోంది.







