బండ్ల గణేష్ ఆస్తి వేలం స‌బ‌బే.. – సుప్రీం కోర్టు షాక్‌

బండ్ల గణేష్ ఆస్తి వేలం స‌బ‌బే.. - సుప్రీం కోర్టు షాక్‌

Summarize with AI

సినీ నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్‌కు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం భారీ షాక్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్ర‌యించినా ఆయ‌న‌కు ఎదురుదెబ్బే త‌గిలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన కుటుంబ ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ సినీ నిర్మాత బండ్ల గణేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పు సరైందేనని అత్యున్నత నాయస్థానం స్పష్టం చేసింది.

‘శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ లిమిటెడ్’ తీసుకున్న రుణాలకు బండ్ల గణేష్ ఆయన కుటుంబ సభ్యులు వ్యక్తిగత గ్యారెంటీర్లుగా ఉన్నారు. అప్పులు చెల్లించకపోవడంతో సర్ఫేసి చట్టం కింద 2019లో జూబ్లీహిల్స్‌లోని ఆస్తిని యూనియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుని, 2022లో వేలం వేసింది. ఈ వేలంలో రూ. 8.51 కోట్లు సమకూరాయని బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే, ఈ వేలం ప్రక్రియను సవాల్ చేస్తూ బండ్ల గణేష్ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా, డీఆర్టీ వేలాన్ని రద్దు చేస్తూ వారికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది.

డీఆర్టీ తీర్పును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ జరుగుతున్నప్పటికీ, ఆ నిషేధం కేవలం కంపెనీ ఆస్తులకు మాత్రమే వర్తిస్తుందని.. వ్యక్తిగత హామీదారుల ఆస్తుల వేలంపై ఎలాంటి నిషేధం ఉండదని బ్యాంక్ వాదించింది. అలాగే, రూ. 82 కోట్ల వన్ టైమ్ సెటిల్‌మెంట్ లో ఈ వేలం సొమ్మును మినహాయించుకునేందుకు అంగీకరించి కూడా మళ్లీ డీఆర్టీని ఆశ్రయించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

యూనియన్ బ్యాంక్ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు, డీఆర్టీ ఉత్తర్వులను కొట్టివేస్తూ బ్యాంక్ చేపట్టిన ఆస్తి వేలం చట్టబద్ధమేనని తీర్పునిచ్చింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తూ ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో బండ్ల గణేష్‌కు చట్టపరంగా తీవ్ర ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment