వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడనే కక్షతో కట్టుకున్న భర్తను ఓ భార్య దారుణంగా హత్య చేయించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గుడికి వెళ్దామని నమ్మించి తీసుకెళ్లి, ఘాట్ రోడ్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రియుడు, మరో యువకుడితో కలిసి భర్తను అంతమొందించింది. అనంతరం భర్త బండి మీదనే ప్రియుడితో కలిసి రైల్వే స్టేషన్కు ఉడాయించింది.
అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని సూలగిరి పరిధి దేవసానపల్లెకు చెందిన రమేష్ (24), హోసూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి కుప్పం నియోజకవర్గం బోయనపల్లెకు చెందిన హాసినితో రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న మౌలికశ్రీ అనే కుమార్తె ఉంది. సోమవారం ఈ కుటుంబం బోయనపల్లెలోని హాసిని పుట్టింటికి వచ్చింది.
మంగళవారం ఉదయం సంగనపల్లెలోని ప్రసిద్ధ మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్తున్నామని చెప్పి భార్యాభర్తలు, పాపతో కలిసి బైక్పై బయల్దేరారు. అయితే రాత్రయినా వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన హాసిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న కుప్పం పోలీసులు మల్లప్పకొండ ఆలయ సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడంతో అసలు ఘోరం వెలుగు చూసింది. ఆలయానికి వెళ్లేటప్పుడు భర్త, పాపతో కలిసి వెళ్లిన హాసిని.. తిరుగు ప్రయాణంలో మాత్రం భర్త రమేష్ తెచ్చిన బైక్పైనే మరో ఇద్దరు యువకులతో కలిసి వెళ్తుండటాన్ని పోలీసులు గుర్తించారు.
ఉద్దేశపూర్వకంగా పర్స్ పడేసి, కొంత దూరం వెళ్లాక తన పర్స్ పడిపోయిందని హాసిని రమేష్కు చెప్పింది. పర్స్ కోసం రమేష్ వెళ్లగా.. అక్కడ ఆల్రెడీ కాపుకాస్తున్న ప్రియుడు యుగంధర్, అతని స్నేహితులు కలిసి దాడి చేసి చంపేశారు. డెడ్ బాడీని వదిలేసి.. రమేష్ బైక్పైనే మరో ఇద్దరితో కలిసి హాసిని రైల్వే స్టేషన్కు వెళ్లింది. సాక్ష్యాల ఆధారంగా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా మల్లప్పకొండ ఘాట్ రోడ్డు సమీపంలో రమేష్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఆధారంగా భార్యే భర్త రమేష్ను చంపినట్టుగా పోలీసులు తేల్చారు.








