అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనంతో పాటు ఉద్యోగభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. పవర్లోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా.. తమను పట్టించుకోవడం లేదని, తమ ఉద్యోగాలను తీసేశాడని ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వలంటీర్లంతా సిద్ధమయ్యారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు వలంటీర్లు పిలుపునిచ్చారు.
స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య వలంటీర్ల నిరసనలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో వలంటీర్ల సమస్యలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వలంటీర్ల జీవన విధానంపై సరైన నిర్ణయం తీసుకోకపోతే, ఆకాంక్షల సాధన కోసం వినూత్నమైన నిరసన కార్యక్రమాలు చేపట్టబడతామని ఆయన వివరించారు.
వినూత్న నిరసన
జనవరి 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాలలో వినతి పత్రాల సమర్పణ. 3వ తేదీ జిల్లా కేంద్రాల్లో మోకాళ్ల మీద కూర్చుని భిక్షాటన. 4వ తేదీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆడిమాట తప్పారని గుర్తుచేస్తూ (బ్యాక్ టు వాక్) వెనకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసనల ద్వారా వలంటీర్ల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా, డిమాండ్లపై తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తామని చెప్పారు.