ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయ శైలిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మాణిక్యం ఠాగూర్ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యమని, తన రాజకీయ మనుగడ కోసం ఆయన దేనికైనా సిద్ధపడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
కుటుంబానికి, రాష్ట్రానికి ద్రోహం
చంద్రబాబు చరిత్రను ప్రస్తావిస్తూ మాణిక్యం ఠాగూర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. “సొంత మామగారికే వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనది. ఇప్పుడు తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. కుటుంబానికి ద్రోహం చేయడం నుండి ప్రజలకు ద్రోహం చేయడం వరకు ఆయన ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది” అని ధ్వజమెత్తారు.
దక్షిణాది ప్రయోజనాలపై రాజీ
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ గొంతు నొక్కేస్తున్నారని ఠాగూర్ ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేకూర్చే వివక్షాపూరిత డీలిమిటేషన్ ప్రక్రియకు చంద్రబాబు మద్దతు తెలపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దక్షిణాది గొంతును బలహీనపరచడమేనని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించాల్సింది పోయి, చంద్రబాబు పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇది ఒక పథకం ప్రకారం కేంద్రానికి లొంగిపోవడమేనని విమర్శించారు.
బీసీ మహిళలకు అన్యాయం
సరైన కుల గణన జరగకుండానే కేంద్ర నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం ద్వారా చంద్రబాబు వెనుకబడిన వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఠాగూర్ మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా పార్లమెంటులోకి ప్రవేశించాల్సిన బీసీ మహిళల అవకాశాలను చంద్రబాబు స్వయంగా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెడుతూ, కేవలం అధికార దాహంతోనే చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ విమర్శించారు.









