ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుపై (Former SIB Chief Prabhakar Rao) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (SIT) ఇవాళ ఐదో రోజు కస్టోడియల్ విచారణ చేపట్టనుంది. ఆయన ఎస్ఐబీ చీఫ్గా ఉన్న సమయంలో ఉపయోగించిన ఒక మొబైల్ ఫోన్ను(Mobile Phone) ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఫార్మాట్ (Formatted) చేసినట్లు సిట్ గుర్తించింది. అయితే ఆ సమయంలో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ అంశాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నివేదిక కూడా నిర్ధారించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆ మొబైల్ ఫోన్ను ఎవరు ఫార్మాట్ చేశారు? దానికి కారణాలేమిటి? అన్న కోణంలో సిట్ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. ఫోన్ ఫార్మాట్ చేసిన సమయంలో ఇంట్లో ఎవరు ఉన్నారు, ఈ ప్రక్రియకు ఎవరు సహకరించారు, ఎవరి ఆదేశాల మేరకు ఇది జరిగిందన్న అంశాలపై అధికారులు దృష్టి సారించారు.
వాట్సాప్ కాల్స్, చాట్స్, ఐపీ అడ్రెసుల ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తున్నప్పటికీ, ఆయన నుంచి సరైన సమాధానాలు లభించడం లేదని తెలుస్తోంది. 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన అనంతరం ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
అదే సమయంలో మొబైల్ ఫోన్లు, క్లౌడ్ డేటా, ల్యాప్టాప్లోని కీలక సమాచారాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందన్న అంశంపైనా సిట్ విచారణ జరుపుతోంది. గత ప్రభుత్వ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న దానికి సంబంధించి సిట్ వద్ద పటిష్ట ఆధారాలు ఉన్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలపై జరిగింది అన్న కీలక అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.








