చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి (PeddiReddy) కుటుంబానికి చెందిన వ్యక్తికి దేశ వ్యాప్తంగా పేరొస్తోందని, తన కొడుకు లోకేష్(Lokesh) కంటే ఎక్కువగా ఎదుగుతున్నాడనే కక్షతోనే ఎంపీ మిథున్రెడ్డి (Mithun Reddy)ని అక్రమ కేసులో అరెస్టు చేశారని, ఇన్నాళ్లు అయినా కస్టడీకి తీసుకోలేదని, ఈ కేసు ఎక్కువ కాలం నిలబడలేదని వైసీపీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి అన్నారు.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని వైసీపీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy ములాఖత్ (Meeting)లో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ(TDP) ప్రభుత్వాన్ని, కూటమి విధానాలను తీవ్రంగా విమర్శించారు.
మిథున్ రెడ్డిని కట్టు కథలు అల్లిపెట్టి జైలులో పెట్టారని బైరెడ్డి ఆరోపించారు. ఆయన అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదని, చిత్తూరు జిల్లాకు చెందిన ఒక నాయకుడు దేశస్థాయిలో ఎదిగిపోతే భవిష్యత్తులో టీడీపీకి ఇబ్బందిగా ఉంటుందని భావించి అక్రమ కేసులో ఇరికించారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy)ని ఓడించిన మిథున్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఈ అరెస్టు జరిగిందని వ్యాఖ్యానించారు. “కస్టడీకి ఇప్పటివరకు ఎందుకు పిలవలేదు? ఇటువంటి కేసులు ఎక్కువకాలం నిలబడవు. కథలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు” అని బైరెడ్డి ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వ వైఫల్యాలను గుర్తుచేస్తూ, “30,000 మంది అమ్మాయిలు మిస్సయ్యారని చెప్పి ఒక్కరినైనా తిరిగి తీసుకొచ్చారా? కల్తీ మద్యం వల్ల ఎంతోమంది ఆసుపత్రిపాలయ్యారు, ఒక్క కేసైనా నమోదు చేశారా?” అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై కూడా బైరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రీతి మర్డర్ కేసు (Preethi Murder Case)లో ఆధారాలు చెరిపేశారన్న పవన్ వ్యాఖ్యలు దారుణమని, మృతురాలి తల్లిదండ్రులే టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని గుర్తుచేశారు.
“జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)కి ఎప్పటికప్పుడు అండగా నిలిచే నాయకులకి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది” అని బైరెడ్డి స్పష్టం చేశారు. “అన్నదాత సుఖీభవ వంటి పథకాలు గానీ, అభివృద్ధి కార్యక్రమాలు గానీ కూటమి ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదు. మిథున్ రెడ్డి ఎంపీ అయినా ఇవ్వాల్సిన సదుపాయాలు కూడా కల్పించలేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. జైలులో కూడా మిథున్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.