పవన్ కళ్యాణ్‌పై లోకేష్ నిఘా నేత్రం..!

పవన్ కళ్యాణ్‌పై లోకేష్ నిఘా నేత్రం..!

Summarize with AI

పైకి అంతా ప్రశాంతం.. లోపల మాత్రం నివురు గప్పిన నిప్పు.. ఏపీ అధికార కూటమిలో అత్యున్నత స్థాయిలో ఒకరిపై ఒకరు నడుపుతున్న మైండ్ గేమ్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి కదలికపై మంత్రి నారా లోకేష్ కార్యాలయం డేగ కన్ను వేసిందా? పవన్ కళ్యాణ్ అంతర్గత వ్యూహాలు, ప్రైవేట్ భేటీల సమాచారం పిన్-టు-పిన్ లోకేష్‌ టేబుల్ మీదికి చేరుతోందా? అంటే.. జనసేన వర్గాలు జీర్ణించుకోలేని సమాచారం బ‌య‌ట‌ప‌డుతోంది.

ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ భద్రత, పర్యవేక్షణ కోసం మొత్తం మూడు ప్రత్యేక టీమ్‌లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ భద్రతా వలయమే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు ఒక పెద్ద తలనొప్పిగా మారిందనే అనుమానాలు జ‌న‌సేన వ‌ర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఎవరిని కలుస్తున్నారు? ఏఏ నేతలతో భేటీలు జరుగుతున్నాయి? ఏ చర్చకు ఎంత ప్రాధాన్యత ఉంది? జనసేన పార్టీ భ‌విష్యత్తు కార్యాచ‌ర‌ణ‌ ఏంటి? అనే అంశాలపై లోకేష్ కార్యాలయం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే కొంతమంది కీలక భద్రతా సిబ్బంది ద్వారానే ఈ సమాచారమంతా నారా లోకేష్ టీమ్‌కు లీక్ అవుతోందనే అనుమానాలు జనసేన సీనియర్ నేతలను కలవరపెడుతున్నాయి.

సాధారణంగా జరిగే అధికారిక సమావేశాల కంటే, పవన్ కళ్యాణ్ అత్యంత రహస్యంగా జరిపే వ్యక్తిగత రాజకీయ చర్చల వివరాలనే ఈ నిఘా వర్గాలు టార్గెట్ చేసినట్లు సమాచారం. తన వ్యక్తిగత విషయాలు, పార్టీ రహస్యాలు బయటకు పొక్కుతున్నాయని గ్రహించిన జనసేనాని.. ఇటీవల కాలంలో అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి.

గత కొద్దిరోజుల వ్యవ‌ధిలోనే పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయానికి చెందిన ప్రధాన సెక్యూరిటీ సిబ్బందిని రెండు మూడు సార్లు నిర్మొహమాటంగా బయటకు పంపించేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సదరు భ‌ద్రతా సిబ్బంది పరిధిని కేవలం పార్టీ కార్యాలయం బయటి వరకే పరిమితం చేసిన‌ట్టుగా చెబుతున్నారు. లోపల జరిగే అంతర్గత వ్యవహారాల్లోకి ఎవ‌రికీ ఎంట్రీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గట్టిగా చెక్ పెట్టారని జ‌న‌సైనికులు అంటున్నారు.

త‌న త‌ల్లిని అవ‌మానించేలా లోకేష్ దూషణ‌లు చేశాడ‌ని గ‌తంలో అనేక సంద‌ర్భాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌హిరంగ వేదిక‌ల పైనుంచే వెల్లడించారు. త‌ల్లిని తిట్టించినా అవేవీ ఖాత‌రు చేయ‌కుండా మ‌ళ్లీ టీడీపీతో జ‌ట్టుక‌ట్టాడు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు త‌రువాత అటు త‌న సొంత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అన్నీ తానే అన్నట్టుగా లోకేష్ వ్యవ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. భ‌విష్యత్తులో త‌న‌ ఎదుగుద‌ల‌ సునాయాసంగా సాగేలా, ఎవ‌రి నుంచి అవ‌రోధాలు, ఆటంకాలు ఎదుర‌వ్వకుండా ఉండేందుకే ఇంత‌టి దుస్సాహ‌సానికి తెగ‌బ‌డుతున్నాడ‌ని జ‌న‌సేన వ‌ర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ప్రజాక్షేత్రంలో కలిసికట్టుగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. అంతర్గతంగా లోకేష్ వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తోటి భాగస్వామ్య పక్ష నాయకుడిపై, అందులోనూ ప్రభుత్వ ఏర్పాటు కోసం, కూట‌మి 15 ఏళ్లు క‌లిసి ఉండాల‌ని కోరుకునే తనపై ఇలా నిఘా ఏంట‌ని ప‌వ‌న్ గుర్రుగా ఉన్నట్టు స‌మాచారం.

ఈ నిఘా వ్యవహారం బయటకు పొక్కడంతో తెలుగుదేశం, జనసేన మధ్య అంతర్గత దూరం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందంటున్నారు విశ్లేష‌కులు. పవన్ పై నిఘా వ్యవహారంపై అటు లోకేష్ కార్యాలయం గానీ, ఇటు జనసేన టాప్ లీడర్‌షిప్ గానీ అధికారికంగా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా.. ఏపీ రాజకీయాల్లో ఈ ‘షాడో పాలిటిక్స్’ ఇప్పుడు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment