మనం ఏ శతాబ్దంలో ఉన్నాం? చట్టాలు, హక్కులు, మహిళా రక్షణ అంటూ పాలకులు వేదికలపై ఇచ్చే ఉపన్యాసాలు ఎవరి కోసం? గుంటూరు నగరంలోని కృష్ణబాబు కాలనీలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోరం శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చూశాక.. ప్రతి ఒక్కరి మనస్సాక్షిని ఈ ప్రశ్నలు వేధిస్తూనే ఉంటాయి.
నీటి పైప్లైన్ వివాదం కారణంగా ఓ మహిళపై తెలుగుదేశం పార్టీ నేత కుటుంబం దారుణంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి, తీవ్రంగా కొట్టారు. కృష్ణబాబు కాలనీలో నివసిస్తున్న బాధితురాలు సుమారు 15 ఏళ్లుగా తన ఇంటి నీటి పైప్లైన్కు మోటారు ఏర్పాటు చేసుకుని నీటిని వినియోగిస్తోంది. ఇటీవల ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు నిర్మించడంతో, పైప్లైన్కు ఉన్న మోటారును తొలగించాలని స్థానిక టీడీపీ నాయకుడు మల్లెల వెంకట రమణమూర్తి నగర పాలక సంస్థకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ విషయమై బాధితురాలు ఆయనను కలిసి మాట్లాడగా, ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తనను బెదిరించారని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నగరంపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నామని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లింది.
ఆ తర్వాత మల్లెల వెంకట రమణమూర్తితో పాటు మరో ట్రాన్స్జెండర్ మహిళ, కుటుంబ సభ్యులు సహా పలువురు కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి విచక్షణారక్షితంగా దాడి చేశారు. ఆమెను నేలకేసి పడేసి కొట్టడమే కాకుండా, అడ్డుకునేందుకు వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు.
ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేసి సుమారు 10 నిమిషాల పాటు తీవ్రంగా అవమానిస్తూ దాడి చేశారు. దాడికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో బాధితురాలితో రాజీ చేసేందుకు కొందరు స్థానిక టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే హోంమంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ వెంటనే స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.








