కడియం శ్రీ‌హ‌రి ‘న‌ల్లికుట్లోడు’.. మంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు

కడియం శ్రీ‌హ‌రి 'న‌ల్లికుట్లోడు'.. మంత్రి సురేఖ సంచలన వ్యాఖ్యలు

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వివాదం రాజుకుంది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి తన మంత్రి పదవిని ఓర్వలేక, తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషని, తాను మంత్రిగా ఉంటే తట్టుకోలేకపోతున్నాడన్నారు. కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు.

కొండా సురేఖ మాట్లాడుతూ.. కడియం శ్రీహరి గతంలో అదృష్టవశాత్తూ మంత్రి పదవి సాధించారని, కానీ ఇప్పుడు తాను మంత్రిగా ఉంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. “నేను మంత్రిని కాబట్టి నా ముందు కూర్చోవడానికి కడియం శ్రీహరి ఇబ్బంది పడుతున్నారు. అందుకే నా మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లి నాపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడు” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నా బిడ్డ ఎమ్మెల్యే కాలేదు.. క‌డియం శ్రీ‌హ‌రి బిడ్డ ఎంపీగా గెలిచింది.. అందుక‌ని తాను ఆమె పదవి పోతుందని ప్రచారం చేస్తున్నానా.. అని సురేఖ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలో ఈ వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి 2024 మార్చి 31న కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై సొంత జిల్లా అధికార పార్టీ నేత‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరిని “నల్లికుట్లోడు” అని విమర్శించారు. కొండా ముర‌ళీ కూడా ఆయ‌న‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. గతంలో టీడీపీలో 15 ఏళ్లు ఉండి ఆ పార్టీని దెబ్బతీసి చంద్రబాబును ఓడించారని ఆరోపించారు. ఈ ఘటన వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉద్రిక్తతను పెంచింది. కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య విభేదాలు తీవ్రతరం కావడంతో పార్టీలో ఐక్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment