బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం 2016లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అనేక దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ, భారతీయ సినిమాలకు పెద్ద మార్కెట్ ఉన్న పాకిస్తాన్లో మాత్రం ‘దంగల్’ విడుదల కాలేదు. దీనికి గల కారణాన్ని తాజాగా ఆమిర్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. రెజ్లర్ మహవీర్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 2,070 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు నితేశ్ తివారీ దర్శకత్వం వహించారు.
‘దంగల్’ పాకిస్తాన్లో విడుదల కాకపోవడానికి గల కారణాలను ఆమిర్ ఖాన్ వివరిస్తూ, “పాకిస్తాన్లో ‘దంగల్’ విడుదల కావాలంటే వారు రెండు షరతులు పెట్టారు. మా సినిమాలో ఉన్న భారత జాతీయ గీతం మరియు జాతీయ జెండాను తొలగించాలని అక్కడి సెన్సార్ బోర్డు కోరింది. నేను అందుకు అంగీకరించలేదు” అని తెలిపారు.
“గీతా ఫోగట్ మ్యాచ్ గెలిచిన సన్నివేశంలో భారత జెండాతో పాటు జాతీయ గీతం ఉంటుంది. వాటిని తొలగిస్తేనే ఈ చిత్రానికి అనుమతి ఇస్తామని పాక్ సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో నేను ఒక్క సెకను కూడా ఆలోచించకుండా, ‘మా సినిమా పాకిస్తాన్లో విడుదల కాదు’ అని వారికి చెప్పాను” అని ఆమిర్ ఖాన్ అన్నారు. పాకిస్తాన్ విడుదలను రద్దు చేయడం వల్ల తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిర్మాతలు తనతో చెప్పినప్పటికీ, “భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేనికీ మద్దతు ఇవ్వకూడదని ఆరోజే స్పష్టంగా చెప్పాను” అని ఆమిర్ ఖాన్ వివరించారు.
కాగా, ఈ ఘటన జరిగిన సమయంలోనే ఏప్రిల్లో పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పాకిస్తానీ నటీనటులను బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కోరింది. దీంతో వారిని పూర్తిగా భారత్లో నిషేధించారు.