భారత క్రికెట్ చరిత్రలో జూన్ 23, 2013 ఒక చిరస్మరణీయమైన రోజు. ఈ రోజున మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని రెండోసారి కైవసం చేసుకుని ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటింది. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ను ఓడించి భారత్ టైటిల్ను సొంతం చేసుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ను 20 ఓవర్లకు కుదించగా, ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో ధోనీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. టీ20 ప్రపంచకప్ (2007), వన్డే ప్రపంచకప్ (2011) తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ (2013)ని కూడా గెలిపించిన ఏకైక కెప్టెన్గా చరిత్ర సృష్టించారు. ఫైనల్లో రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడగా, చివరి ఓవర్లలో ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ అద్భుత బౌలింగ్తో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటూ బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు షేర్ చేయగా, అభిమానులు తమకు ఇష్టమైన ఫైనల్ క్షణాలను గుర్తుచేసుకుంటున్నారు.








