‘స్థానిక పోరు’పై జగన్ ఫోకస్.. నేతలకు స్పష్టమైన టార్గెట్లు

'స్థానిక పోరు'పై జగన్ ఫోకస్.. నేతలకు స్పష్టమైన టార్గెట్లు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ సమాయత్తమవుతోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే ఎన్నికలను పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దని స్పష్టం చేస్తూ.. ప్రతి నియోజకవర్గానికి స్పష్టమైన కార్యాచరణ, బాధ్యతలు నిర్దేశించారు.

స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గతంలో ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలను చూశామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి కావని, పార్టీ కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలని వైఎస్ జగన్ సూచించారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా.. పార్టీ నాయకత్వం తమ వెంటే ఉందనే భరోసా ప్రతి కార్యకర్తలో కల్పించాలని సూచించారు. కార్యకర్తలకు అండగా నిలిస్తే.. భవిష్యత్‌లో సాధారణ ఎన్నికల్లో వారు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తారన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున బలంగా నిలబడటం ద్వారా కేడర్‌లో విశ్వాసాన్ని పెంచాలని నేతలకు సూచించారు.

స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన తమకు ఒకరకంగా అనుకూలమేనని జగన్ చెప్పారు. మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మేయర్ వంటి కీలక పదవులకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. బలమైన అభ్యర్థి ఉంటే.. మిగిలిన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు కూడా పర్యవేక్షణతో పాటు బలం లభిస్తుందని చెప్పారు.

ఏ నియోజకవర్గంలోనూ ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకూడదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే.. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి కో-ఆర్డినేటర్లు పార్టీ అభ్యర్థులు కాలేరని హెచ్చరించారు. ఎన్నికల అనంతరం ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారు? వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దతు ఇచ్చారు? అనే అంశాలపై నివేదికలు తెప్పించుకుంటానని చెప్పారు.

“వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన” పేరుతో గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహించాలని వైఎస్ జగన్ సూచించారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి వైసీపీ పాలనకు, కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. ఇంటింటి ప్రచారానికి నిర్దిష్ట తేదీలు, షెడ్యూల్, వ్యవస్థీకృత కార్యాచరణ ప్రకారం నిర్వహించాలని నేతలకు సూచించారు.

పార్టీ కేడర్ కోసం దాదాపు 14–15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధం చేసినట్లు వైఎస్ జగన్ తెలిపారు. గ్రామస్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల కార్యకర్తల వరకు ఈ కార్డులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి గుర్తింపు కార్డులతో పాటు ఇంటింటి ప్రచార సామగ్రిని కూడా కార్యకర్తలకు అందించాలని సూచించారు.

ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్‌లను వెంటనే బలోపేతం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ కేడర్ నుంచి దౌర్జన్యాలు జరిగే అవకాశం ఉందని, అందువల్ల కార్యకర్తలను న్యాయపరంగా రక్షించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి లీగల్ సెల్స్ పరస్పరం సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన కేసులను హైకోర్టు వరకు తీసుకెళ్లేందుకు వ్యవస్థను సిద్ధం చేయాలని సూచించారు.

ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్ జగన్ అన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే చురుగ్గా ఉన్న కార్యకర్తలను గుర్తించడంతో పాటు ఇతరులను కూడా యాక్టివ్ చేయాలని సూచించారు. ‘జగన్ 2.0’ సూపర్ యాప్, వైసీపీ టాక్స్, పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వేదికలను సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు.

రాబోయే 60–70 రోజులు నాయకులు తమ నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా పూర్తిగా స్థానిక ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ కార్యకర్తలను వేధించే లేదా అన్యాయం చేసే అధికారుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై భవిష్యత్‌లో చట్టప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత నిర్మాణం, అభ్యర్థుల ఎంపిక, గ్రామస్థాయి ప్రచారం, లీగల్-మీడియా వ్యవస్థ, సోషల్ మీడియా విభాగాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని వైఎస్ జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment