విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో (Visakhapatnam Steel Plant) జరిగిన ఘోర ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ సంక్షోభ సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం(CM) చంద్రబాబు (Chandrababu) తనయుడు మంత్రి నారా లోకేష్(Nara Lokesh), ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల(Pawan Kalyan) వ్యవహార శైలి, వారు మాట్లాడిన తీరు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. విపత్కర పరిస్థితుల్లో ఈ ఇద్దరు నేతల నాయకత్వ సామర్థ్యం(Leadership Ability), రాజకీయ పరిపక్వత ఎంతవరకు ఉందనే అంశంపై ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రభుత్వ ప్రతినిధిగా, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి బాధితులకు న్యాయం (Justice) చేయాలని డిమాండ్ చేసిన వామపక్షాలు, కార్మిక సంఘాల నేతలపై నారా లోకేష్ ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. బాధితుల పక్షాన నిలబడి నిలదీస్తున్న వారిని ఉద్దేశించి, “మీ కుటుంబంలో (Family) ఎవరూ చనిపోలేదు కదా?” అంటూ లోకేష్ మాట్లాడిన మాటలు బాధితుల గాయాలపై కారం చల్లినట్లు ఉన్నాయని విశ్లేషకులు మండిపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

స్టీల్ ప్లాంట్ తో తనకున్న అనుబంధాన్ని నిరూపించుకోవడానికి లోకేష్ చెప్పిన కొన్ని ఉదాహరణలు నవ్వులాటగా మారాయంటున్నారు విశ్లేషకులు. హైదరాబాద్లోని తమ ఇంటికీ, అమరావతిలో నిర్మించుకుంటున్న తమ రెండో ఇంటికీ విశాఖ స్టీల్ ప్లాంట్నే వాడామని చెప్పడం అసందర్భ ప్రేలాపనగా చెబుతున్నారు. బాధితుల కోసం వచ్చి వారికి ఇచ్చిన భరోసా ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యమంత్రి పీఠం కోసం లోకేష్ అటు ఇంట్లోనూ, ఇటు పార్టీలో అంతర్గతంగా ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో.. ఇలాంటి పెద్ద ప్రమాదాన్ని డీల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. మీడియా ముందు తోటి నాయకులతో కలిసి ఇకిలింపులు, వెటకారాలు చేయడం, ప్రశ్నించిన జర్నలిస్టులకు 90 రోజులు అంటూ సవాళ్లు విసరడం వంటి చేష్టలు చూశాక, ఆయన నాయకత్వంపై ఆశలు పెట్టుకున్న తమ్ముళ్లే “నిన్నటితో అంతా అయిపోయింది” అనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

పవన్ కల్యాణ్ పలాయనవాదం?
ఇక మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పరామర్శ అనంతరం చేసిన వ్యాఖ్యలు మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఘటనపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటంపై సెటైర్లు పేలుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వమే (Alliance Government) అధికారంలో ఉంది. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటికీ తానేదో ప్రతిపక్షంలో ఉన్నట్లు, వైసీపీ (YCP) పైనే నిందలు నెట్టే ప్రయత్నం చేయడం చర్చనీయాంశమైంది. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు వైసీపీతో కుమ్మక్కై భూములు అమ్మేందుకు ప్రయత్నించాయని పవన్ ఆరోపించారు. అయితే, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న RINL సంస్థను లేదా దాని భూములను ఒక రాష్ట్ర ప్రాంతీయ పార్టీ ఎలా అమ్మేస్తుందని కార్మికులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్లో నిర్వహణ లోపం ఎక్కువగా ఉందంటున్నారు కదా అని రిపోర్టర్ ప్రశ్నిస్తే.. దీనిపై “నాకు అనుభవం లేదు” అని పవన్ సమాధానం ఇవ్వడం ఆయన అవగాహనారాహిత్యాన్ని స్పష్టం చేస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రమాదంపై బాధ్యత తీసుకోవాల్సి వచ్చేసరికి టీడీపీ, జనసేన కాకుండా “ఎన్డీయే (NDA)” అంటూ కేంద్రం వైపు వేలెత్తి చూపడంపై విమర్శలు వస్తున్నాయి.

విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడే అసలైన నాయకుడి సామర్థ్యం, గుణం బయటపడతాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన విషయంలో లోకేష్ దుందుడుకు స్వభావం, పవన్ కల్యాణ్ అర్థంకాని మీడియా సమావేశం.. ఇద్దరి రాజకీయ అపరిపక్వతను స్పష్టంగా బయటపెట్టాయని చర్చించుకుంటున్నారు. బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సింది పోయి, రాజకీయ విమర్శలకు ప్రాధాన్యమివ్వడం విస్మయానికి గురిచేస్తోంది.









